Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో పబ్ కు వెళ్లిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. ఎమ్మెల్యే కొడుకు కూడా?

By:  Tupaki Desk   |   3 Jun 2022 7:56 AM GMT
హైదరాబాద్ లో పబ్ కు వెళ్లిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. ఎమ్మెల్యే కొడుకు కూడా?
X
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. పబ్ కు వెళ్లిన ఒక మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకున్నా.. వివరాలు బయటకు పొక్కనివ్వలేదు. తాజాగా ఈ ఉదంతం బయటకు రావటం కలకలాన్ని రేపుతోంది. తొలుత మైనర్ బాలికపై కొందరు కుర్రాళ్లు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా చెప్పినా.. నిజానికి అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉదంతంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మే 28న జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబరు 36లో అమినీషియా పబ్ లో ఒక పార్టీ జరిగింది. మద్యం సప్లై చేయాల్సిన అవసరం లేని పార్టీగా చెప్పి బుక్ చేసినట్లు చెబుతున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో పార్టీ ముగిసినట్లుగా చెబుతున్నారు.

అయితే..బయటకు వచ్చిన మైనర్ బాలికను పబ్ లో పరిచయమైన కొందరు కుర్రాళ్లు తమ కారులో డ్రాప్ చేస్తామని నమ్మించినట్లుగా తెలుస్తోంది. వారి మాటలు నమ్మి కారు ఎక్కిన ఆ మైనర్ బాలికను తర్వాత బయటకు తీసుకెళ్లారని.. అక్కడ గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెబుతున్నారు.

పబ్ నుంచి బయలుదేరిన బెంజ్ కారులో ఎక్కిన కుర్రాళ్లలో నగరానికి చెందిన పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పబ్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లో ఉన్న కాన్సు బేకరివద్దకు వెళ్లినట్లుగా సీసీ కెమేరాలో చెబుతున్నారు. కాసేపటి తర్వాత (ఇప్పుడు అందుతున్న సమచారం ప్రకారం కొన్ని గంటల తర్వాతగా తెలుస్తోంది) ఇన్నోవా కారులో తిరిగి రావటం.. ఆ మైనర్ బాలికను అక్కడే వదిలినట్లుగా చెబుతున్నారు.

ఇంటికి వెళ్లిన మైనర్ బాలిక మెడ మీద గాయాలు ఉండటంతో .. ఆ విషయాన్ని గుర్తించిన అమ్మాయి తండ్రి ప్రశ్నించటంతో తనపై జరిగిన అత్యాచార కాండ గురించి ఆ అమ్మాయి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.

అయితే.. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్న వైనం షాకింగ్ గా మారింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మైనర్లను పబ్ లోకి అనుమతించిన వైనంపై యాజమాన్యంపై కేసు నమోదు చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీకి వెళ్లిన కుర్రాళ్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంత దారుణ ఘటనను పోలీసులు ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారన్నది ప్రశ్నగా మారింది.