Begin typing your search above and press return to search.

గాంధీ ఆస్ప‌త్రిలో క‌ల‌క‌లం: ఆస్ప‌త్రి సిబ్బందికి వైర‌స్‌

By:  Tupaki Desk   |   26 Jun 2020 3:00 PM GMT
గాంధీ ఆస్ప‌త్రిలో క‌ల‌క‌లం: ఆస్ప‌త్రి సిబ్బందికి వైర‌స్‌
X
రాష్ట్ర‌వ్యాప్తంగా వైర‌స్ ఆస్ప‌త్రిగా హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిని ప్ర‌క‌టించి రాష్ట్రంలో వైర‌స్ బాధితులంద‌రినీ ఈ ఆస్ప‌త్రిలో చేర్పిస్తున్న విష‌యం తెలిసిందే. రోజురోజుకు కేసులు పెరుగుతుండ‌డంతో రోగుల‌తో ఆస్ప‌త్రి దాదాపు నిండిపోయింది. ప‌రిస్థితి అలాగే ఉంటే తాజాగా ఆస్ప‌త్రి సిబ్బంది భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. ఆస్ప‌త్రి సిబ్బందికి కూడా వైర‌స్ సోకుతోంది.

తాజాగా గాంధీ ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ పేషీలో వైరస్ కలకలం రేగింది. సూపరింటెండెంట్ పీఏ, అసిస్టెంట్ పీఏ, నర్సుకు వైర‌స్ పాజిటివ్ అని తేలింది. దీంతోపాటు వారి కుటుంబసభ్యులకు కూడా వైర‌స్‌ సోకినట్లు నిర్ధారణ అవ‌డంతో ఆస్ప‌త్రిలోని వైద్య సిబ్బంది ఆందోళ‌న చెందుతున్నారు. వైర‌స్ బాధితుల‌కు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్ప‌త్రి సిబ్బంది వైరస్ బారిన పడడంతో సంచ‌ల‌నం రేపుతోంది. దీంతో మిగతా సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం.. ఆస్ప‌త్రిలో రోగులు నిండుకోవ‌డం వంటి వాటితో ప్ర‌స్తుతం ఉన్న సిబ్బంది అతి క‌ష్టం విధులు నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఆస్ప‌త్రిలోని సిబ్బందికి వైర‌స్ సోక‌డంతో వారంతా విధులు నిర్వ‌హించ‌లేమంటూ చేతులెత్తేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం వారంతా ప‌ని ఒత్తిడితో పాటు వైర‌స్ భ‌యంతో ఉన్నారు.

హైదరాబాద్‌లో పరిస్థితులు భ‌యాందోళ‌న‌క‌రంగా త‌యార‌య్యాయి. ఈ వైర‌స్ బారిన వైద్యులు పెద్ద సంఖ్యలో ప‌డుతున్నారు. తాజాగా పేట్లబురుజులోని ప్ర‌సూతి ఆస్ప‌త్రి‌లో 30 మందికిపైగా ఇన్ఫెక్షన్‌కు గురి కాగా.. ఉస్మానియా దంత వైద్య‌శాల సూపరింటెండెంట్, కొండాపూర్ ఏరియా ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ వైర‌స్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. నిమ్స్, ఉస్మానియా వైద్య క‌ళాశాల‌ల్లో కూడా జూనియ‌ర్ డాక్ట‌ర్లు, విద్యార్థులు కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. దీంతో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది.