Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ మాటః ప‌వ‌న్‌ ను క‌లుస్తా

By:  Tupaki Desk   |   15 April 2016 4:45 AM GMT
టీడీపీ ఎంపీ మాటః ప‌వ‌న్‌ ను క‌లుస్తా
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చింది ఒక్క ఇంట‌ర్వ్యూ మాత్ర‌మే అయిన‌ప్ప‌టికీ అందులో ప‌వ‌న్ చేసిన కామెంట్లు ఆస‌క్తినే కాదు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల‌ను లేవ‌నెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ కామెంట్ల‌పై స్పందించారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయలేదని పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సమంజసం కాదని జ‌య‌దేవ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయితే ఆయ‌న కామెంట్ల‌పై తాను గాలివాటంగా స్పందించ‌న‌ని పేర్కొంటూ అస‌లు తాము ఏ విధంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామో పవన్ కళ్యాణ్‌ ను కలిసి వివ‌రిస్తామ‌ని అన్నారు. అనంతరం త‌మ అభిప్రాయాల‌ను తెలియజేస్తామ‌ని చెప్పారు.

ఇక బీజేపీ-టీడీపీ బంధంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విధానాన్ని జ‌య‌దేవ్ ప్ర‌స్తావించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం విడతల వారీగా నిధులు అందజేస్తూ సహకరిస్తోందని సంతృప్తి వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తుందని కేంద్రంపై భ‌రోసా వ్య‌క్తం చేశారు. టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షాల మైత్రి గురించి ప్ర‌స్తావిస్తూ 2019 సాధారణ ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుంద‌ని తెలిపారు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.