Begin typing your search above and press return to search.

రెచ్చిపోకుండా చూడొచ్చుగా ముద్దుకృష్ణమ?

By:  Tupaki Desk   |   5 March 2016 4:25 AM GMT
రెచ్చిపోకుండా చూడొచ్చుగా ముద్దుకృష్ణమ?
X
ప్రతి సమస్యకు ఎవరి మీదనో బురద జల్లే కంటే.. ఆత్మవిమర్శకు మించిన మంచి పరిష్కార మందు మరొకటి ఉండదు. ఏపీ అధికారపక్ష నేతల తీరు చూస్తుంటే ఈ చిన్న విషయాన్ని మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది. సమస్యలు తెర మీదకు రాకుండానే చేయగలిగిన సత్తా ఉంటే సమస్యే ఉండదు. కానీ.. ఈ నిజాన్ని మర్చిపోవటం ఏపీ తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని..మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మందకృష్ణను విపక్ష నేత జగన్ రెచ్చగొడుతున్నారంటూ ఆరోపిస్తున్న ఏపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు. ప్రాంతాల వారీగా.. కులాల వారీగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారి పల్లె నుంచి మాదిగల విశ్వరూప ప్రదర్శన చేస్తామని మందకృష్ణ మాదిక ఇచ్చిన వార్నింగ్ ఏ మాత్రం సరికాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు గాలి ముద్దుకృష్ణమ. గతంలో మదిగలకు న్యాయం చేసింది చంద్రబాబేనని వ్యాఖ్యానిస్తున్న ముద్దుకృష్ణమ.. తెలంగాణలో మాదిగల సమస్యల్ని వదిలేసి.. ఏపీలో ఆందోళన చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి గాలి ప్రశ్నలోనే సమాధానం ఉంది. సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి. కానీ.. వాటిని తెర మీదకు తెచ్చి.. ఆందోళన చేసే అవకాశం ఎవరు ఇస్తున్నారన్న విషయం మర్చిపోకూడదు. గాలి మాట ప్రకారమే చూస్తే.. ఏపీలో మాదిరే తెలంగాణలోనూ విపక్షాలు ఉన్నాయి. కానీ.. ఏపీ విపక్ష నేత జగన్ కు మాత్రమే అవకాశం ఎందుకు దొరుకుతుంది? తెలంగాణలోని విపక్షాలకు అవకాశం ఎందుకు రావటం లేదు? అన్న ప్రశ్న వేసుకుంటే.. చంద్రబాబులో లేనిది.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఉన్నదేంటో ఇట్టే అర్థమవుతుంది. ఎదుటోళ్లపై విమర్శలు చేసే ముందు.. తమలో ఉన్న తప్పుల్ని సరి చేసుకుంటే ఇన్నేసి మాటలు అనాల్సిన అవసరం ఉండదేమో ముద్దుకృష్ణమా?