Begin typing your search above and press return to search.

ఎన్నికల సిత్రం..జైబోలో కేసీఆర్ కాదు..గణేష్..

By:  Tupaki Desk   |   2 Nov 2018 1:30 AM GMT
ఎన్నికల సిత్రం..జైబోలో కేసీఆర్ కాదు..గణేష్..
X
ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గులాబీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఊరూ వాడా తిరుగుతూ చిత్ర విచిత్ర వేషాలతో అలరిస్తున్నారు. స్నానాలు పోస్తూ.. గడ్డాలు గీస్తూ.. అన్నాలు తినిపిస్తూ.. ఎప్పుడూ చూడని సన్నివేశాలను మన కళ్లముందు ఆవిష్కరిస్తున్నారు..

ఎన్నికల వేళ టీఆర్ ఎస్ అభ్యర్థులకు ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతోందట.. ప్రచారానికి తీసుకెళ్లే కార్యకర్తలకు డబ్బులు - మద్యం సరఫరా చేయడం తప్పని సరి.. అవి లేనిదే నేత వెంట ఎవ్వరూ రాని పరిస్థితి. ఇలానే ఖర్చుకు వెనుకాడకుండా చేతిచమరు వదిలించుకుంటున్నారు..

తాజాగా ఇబ్రహీపట్నం నియోజకవర్గంలో ఓ కామెడీ సన్నివేశం చోటుచేసుకుంది. ఇబ్రహీం పట్నంలో టీఆర్ ఎస్ తరఫున మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిలబడి ప్రచారం చేస్తున్నాడు. ఓ గ్రామంలో ప్రచారం చేశాక విలేకరులతో మాట్లాడారు.. తమ అధినేత పథకాలే తమను గెలిపిస్తాయంటూ కేసీఆర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. మంచిరెడ్డితోపాటు ప్రచారంలో పాల్గొన్న ఓ కార్యకర్త అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి పక్కనే ఊగిపోతున్నాడు. మంచిరెడ్డి.. కేసీఆర్ గురించి చెబుతుండగానే.. ‘జై బోలో కేసీఆర్’ అనబోయి.. ‘జై బోలో గణేష్ మహారాజ్’ అని అనేశాడు. దీనికి పక్కనున్న వారు కూడా అదే మత్తులో జై బోలో గణేష్ మహారాజ్ అనేశారు..

ఇలా కేసీఆర్ ను కీర్తించబోయి.. మద్యం ఎక్కువై యథాలాపంగా గణేషుడిని కీర్తించారు. ఈ హఠాత్ పరిణామానికి అవాక్కయిన ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి సీరియస్ ఓ లుక్కేసి అక్కడి నుంచి జారుకున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల సిత్రాల్లో ఎవర్ గ్రీన్ కామెడీగా నిలుస్తోంది..