Begin typing your search above and press return to search.

న‌వ్వొస్తుంది... ఏపీపై మీ న‌ట‌న ఆపండి జైట్లీ !

By:  Tupaki Desk   |   6 Feb 2018 2:00 PM GMT
న‌వ్వొస్తుంది... ఏపీపై మీ న‌ట‌న ఆపండి జైట్లీ !
X
మెత్త‌నోడిని చూస్తే అంద‌రూ కొట్ట‌బుద్ధేస్తుంది అన్న‌ట్లుంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి. అడిగే నాయ‌కుడు ఎవ‌డూ లేదు క‌దా అనుకున్నారో - ఇవ్వ‌క‌పోతే ఏం పీకుతారో చూద్దాం అనుకున్నారో కానీ ఏపీ ప‌ట్ల కేంద్రం అత్యంత నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. నిన్న‌టి నుంచి న‌డుస్తున్న డ్రామా ఈరోజు మ‌రింత ర‌క్తిక‌ట్టిందే కాని... ఒక్క రూపాయికి అద‌నంగా హామీ అయితే ద‌క్క‌లేదు.

నిన్న తెలుగుదేశం ఎంపీలు ధ‌ర్నాలు చేశారు. ఈరోజు పార్ల‌మెంటులో నిర‌స‌న తెలిపారు. మ‌రోవైపు కేవీపీ నిరంత‌రంగా నిర‌స‌న తెలుపుతూనే ఉన్నారు. తెలుగుదేశం నిర‌స‌న మోదీని క‌దిలిస్తుందంటే అంత‌కంటే పెద్ద వింత ఏముండ‌దు. అయితే, బ‌డ్జెట్ అనంత‌రం ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తమైంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే బీజేపీ నేత‌ల‌పై ఎక్క‌డ నిర‌స‌న తెల‌పాలో తెలియ‌క సోష‌ల్ మీడియాలో తెలుగు ప్ర‌జ‌లు బీజేపీని ఆడుకున్నారు. దీంతో ఏపీ బీజేపీ త‌న అక్కౌంట్ కు ప‌రిమితులు విధించుకుంది. ప్ర‌జ‌ల్లోని ఈ కోపం చూసి టీడీపీ క‌దిలింది. దీంతో నిన్న జైట్లీ తెలుగుదేశం ఎంపీల‌తో స‌మావేశం అయ్యారు. కానీ అందులో ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. ఈరోజు ఉద‌యం మ‌ళ్లీ తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ శాఖ త‌ర‌ఫున కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రి మోడీతో స‌మావేశం అయ్యారు. అక్క‌డ కూడా ఎటువంటి హామీ ఇవ్వ‌క‌పోగా ఆందోళ‌న విరమించాల‌ని కోరారు. అయితే, అది నిర్ణ‌యించేది నేను కాదని సుజ‌నా చెప్ప‌డంతో అయితే, చంద్ర‌బాబుతోనే మాట్లాడుతాన‌ని సుజ‌నాను పంపించేశార‌ట‌.

మ‌రోవైపు జైట్లీ దీనిపై స్పందించారు. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తూనే ఉంద‌ని ఒక హాస్యాస్ప‌ద‌మైన వ్యాఖ్య చేశారు. విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లుకు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో స‌మాన‌మైన నిధులు ఎలా ఇవ్వాల‌న్న‌దానిపై ఆలోచిస్తున్నార‌ట జైట్లీ గారు. ఇంత‌కంటే జోక్ ఏముంటుంది. ఈ ఏడాది మ‌రో ద‌ఫా ఎన్నిక‌లు వ‌స్తుంటే ఇక ఆలోచ‌న నిర్ణ‌యంగా మారి నిర్ణ‌యం నిధులుగా మారేది ఎన్న‌డు. కాక‌మ్మ క‌బుర్లు చెప్పి జంకు లేకుండా బొంకు చెబుతున్న కేంద్ర నేత‌ల‌కు ఏపీ పై ఇసుమంతైనా ప్రేమ లేద‌ని ఇట్టే అర్థ‌మ‌వుతోంది. అస‌లు ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటును భ‌రించాల్సిన కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం మొద‌టి ఏడాదికి ఇవ్వాల్సిన దాంట్లోనే 80 శాతం పెండింగ్ పెట్టి ఇంకా క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్ప‌డం అంటే అంత‌కంటే దిగ‌జారుడు ఏం ఉంటుంది. ప్ర‌త్యామ్నాయ మార్గాలు చర్చించేద‌పుడు వాటిని అమ‌లు ప‌రిచేదెన్న‌డు?

ఇదంతా చూస్తుంటే... ఏపీపై బీజేపీకి ఎలాగూ చిత్త‌శుద్ధి లేదు. కానీ అధికారంలో ఉన్న టీడీపీ అయినా తెగించి పోరాడాలి, నిధులు సాధించాలి కానీ ఇలా ఇంకా విన‌తులు చేసుకుంటే ఉంటే ఎన్న‌టికి ప‌నులు అయ్యేను. ఏపీ ఎన్న‌టికి బాగు ప‌డేను?