Begin typing your search above and press return to search.

గ‌డిచిన ఆరు రోజులుగా త‌గ్గిస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   26 Jun 2018 9:00 AM GMT
గ‌డిచిన ఆరు రోజులుగా త‌గ్గిస్తూనే ఉన్నారు
X
దూకుడు త‌గ్గింది. పెట్రోల్.. డీజిల్ మీద ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా బాదేస్తున్న వైనంపై జాతీయ మీడియా మొద‌లు ప్రాంతీయ మీడియా వ‌ర‌కూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం.. దీనిపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం కావ‌టం.. పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల‌పై మోడీ స‌ర్కారు ఇచ్చిన హామీల‌కు భిన్నంగా ధ‌ర‌ల్ని పెంచుకుంటూ పోతున్నార‌న్న విమ‌ర్శ మోడీ ప్ర‌తి ఒక్క‌రి నోటా వినిపించింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో దాదాపు మూడు వారాల పాటు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకొని.. ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన ప‌క్క రోజు నుంచే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని భారీగా పెంచేయ‌టం.. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టంతో.. లీట‌రుకు పైసా త‌గ్గిస్తూ నిర్ణ‌యంపై భారీగా జోకులు పేలాయి. అదేరీతిలో వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరిగితే.. త‌మ‌కు జ‌రిగే న‌ష్టాన్ని ఊహించేందుకు సైతం బీజేపీ నేత‌లు వ‌ణికిపోయిన ప‌రిస్థితి.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు ముందు ధ‌ర‌ల్ని పెంచ‌కుండా ఉండ‌టం.. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం పెంచ‌టం జాతీయ స్థాయిలో మోడీ స‌ర్కారు మీద వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము అధికారంలోకి వ‌స్తే లీట‌రు పెట్రోల్ రూ.50 తీసుకొస్తాన‌ని మాట‌లు చెప్పిన బీజేపీ నేత‌లు.. ఆల్ టైం హైకి ట‌చ్ అయిన ధ‌ర‌ల‌తో నోట మాట రాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. గ‌డిచిన కొద్ది రోజులుగా త‌గ్గిస్తున్న ఇంధ‌న రోజులు తాజాగా మ‌రోసారి త‌గ్గాయి. వ‌రుస‌గా ఆరు రోజుల నుంచి పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని దేశ వ్యాప్తంగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా అమ‌లు చేస్తున్న ప‌న్నుల విధానం కార‌ణంగా ఢిల్లీ.. కోల్ క‌తాల‌లో లీట‌రుకు 14 పైస‌లు త‌గ్గ‌గా.. ముంబ‌యిలో 18 పైస‌లు.. చెన్నైలో 15 పైస‌లు త‌గ్గాయి.

అంత‌ర్జాతీయంగా చూస్తే.. మొన్న‌టి వ‌ర‌కూ భారీ ఎత్తున పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు ఇప్పుడు త‌గ్గు ముఖం ప‌డ్డాయి. అప్ప‌టి నుంచి పెట్రోల్ లీట‌రుకు రూ.2.88 త‌గ్గ‌గా.. డీజిల్ మీద లీట‌రుకు రూ.1.93 త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇంధ‌న ధ‌ర‌ల త‌గ్గింపు మ‌రింత ముందుకు వెళ‌తాయా? అంటే సందేహ‌మే అంటున్నారు. ఎందుకంటే అంత‌ర్జాతీయంగా చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా పెర‌గ‌ట‌మే కాకుండా త‌గ్గ‌టం అనేది ఉండ‌ద‌ని చెబుతున్నారు. మే 30 నుంచి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన పెట్రో ధ‌ర‌లు.. తాజాగా మాత్రం మ‌ళ్లీ పుంజుకుంటున్నాయి. ఒక‌వైపు మోడీ స‌ర్కారు ముంద‌స్తు ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలో సామాన్యుల మొద‌లు ప్ర‌ముఖుల వ‌ర‌కూ అంద‌రూ ప్ర‌భావిత‌మ‌య్యే పెట్రో.. డీజిల్ ధ‌ర‌ల పెంపు త‌ప్ప‌నిస‌రై అయితే త‌ప్పించి పెంచ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో మోడీ స‌ర్కారు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రానున్న‌దంతా ముంద‌స్తు ఎన్నిక‌ల ఫీవ‌ర్ అన్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. పెట్రో.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచ‌టం ద్వారా మోడీ నెత్తిన నిప్పులు పోసుకోర‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. మోడీ మాష్టారేం చేస్తారో చూడాలి.