Begin typing your search above and press return to search.

మార్చి నాటికీ ప్రతి గ్రామానికి ఫ్రీ వైఫై ..!

By:  Tupaki Desk   |   26 Dec 2019 6:55 AM GMT
మార్చి నాటికీ ప్రతి గ్రామానికి ఫ్రీ వైఫై ..!
X
ప్రస్తుత ప్రపంచంలో తినడానికి తిండి లేకున్నా కూడా కొద్దీ రోజులపాటు బ్రతుకుతారు కానీ , ఇంటర్నెట్ లేకపోతే మాత్రం క్షణం కూడా ఉండలేరు. అంతలా ఇంటర్నెట్ కి అడిక్ట్ అయిపోయారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇంటర్నెట్ లో చూసి చేయడం బాగా అలవాటుగా మారిపోయింది. అలాగే మన దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ భాద్యతలు స్వీకరించినప్పటి నుండి అనేక వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే మోడీ డిజిటల్ ఇండియా అంటూ సరికొత్త నినాదాన్ని తీసుకోని వచ్చిన విషయం తెలిసిందే. ఈ డిజిటల్ ఇండియా లో భాగంగా దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు.

డిజిటల్ ఇండియా ప్లాన్‌లో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా మరో దిశగా దూసుకెళ్తోంది. భారత్ నెట్ బ్రాడ్ బాండ్ సర్వీస్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న ప్రతి గ్రామానికి మార్చి 2020 నాటికి ఉచిత వైఫై అందించనున్నారు. భారత్ నెట్‌ తో అనుసంధానమైన అన్ని గ్రామాలకు 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందించగలుగుతామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు.

భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేశామని, దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్ నెట్ ద్వారా 48వేల గ్రామాల్లో ఉచిత వైఫై సేవలు ఉన్నాయి. వీటితో పాటు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ల ద్వారా బ్యాంకింగ్ సేవలు కూడా త్వరలో పొందవచ్చు. డిజిటల్ సేవల్ని విస్తృత పరిచేందుకు 2014లో 60వేల CSCలను కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీటి సంఖ్యను 3.60 లక్షలకు పెంచింది. గ్రామీణ - మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవలు అందించే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం CSC ఈ-గవర్నెన్స్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రామాల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు డిజిటల్ విభజనను తగ్గించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. భారత్ నెట్ ద్వారా గ్రామాల్లో ఉచిత వైఫై అందిస్తే ఈ గ్రామాల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని, ఆయా గ్రామాల్లో ఉన్న చిన్న చితక వ్యాపారస్తులను ప్రోత్సహించినట్లవుతుందని చెబుతున్నారు.