Begin typing your search above and press return to search.

అమెరికాలో సత్తా చాటిన భారతీయులు .. ఏకంగా నలుగురు రెండోసారి ఘనవిజయం !

By:  Tupaki Desk   |   4 Nov 2020 1:50 PM GMT
అమెరికాలో సత్తా చాటిన భారతీయులు .. ఏకంగా నలుగురు రెండోసారి ఘనవిజయం !
X
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఫలితాలు క్షణక్షణానికి తారుమారవుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా విజయదుందుభి మోగిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున ప్రతినిధుల సభకు పోటీచేసిన నలుగురు భారతీయ సంతతి వ్యక్తులు రెండోసారి ఘన విజయం సాధించారు. ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమి బేరా మళ్లీ గెలుపొందారు. ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి సమీప ప్రత్యర్ధి లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌‌పై సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శించారు. ఇక్కడ రెండోసారి పోటీ చేసిన రాజా కృష్ణమూర్తి 71 శాతానికిపైగా ఓట్లను సాధించారు.

ఇక, ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగి డాక్టర్ అమి బెరా ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బజ్ ప్యాటర్‌ సన్‌‌ పై గెలిచారు. 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీపడిన రో ఖన్నా..రిపబ్లికన్ అభ్యర్థి రితేశ్ టాండన్‌ పై విజయం సాధించారు. ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ప్రమీలా జయపాల్ గెలుపు బావుటా ఎగురేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్రైగ్ కెల్లర్ ‌ను చిత్తు చేసింది.

రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న నీరజ్ అంటోని.. ఓహియో నుంచి సెనేట్ కు ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ప్రతినిధుల సభల ఎన్నికలలో.. ఆయన డెమొక్రటిక్ కు చెందిన మార్క్ ఫోగెల్ ను ఓడించారు. ఓహియో నుంచి మొట్టమొదటి సెనేటర్ అయిన భారత సంతతి వ్యక్తిగా నీరజ్ రికార్డు సృష్టించారు. ఆయన వయసు 23 సంవత్సరాలే. యూఎస్ లో ప్రతినిధుల సభకు ఎన్నికైన వారిలో అతడే అత్యంత పిన్న వయస్కుడు.

ఆరిజోనాలో డాక్టర్ హిరల్ త్రిపురనేని అధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో హిరల్ విజయం సాధిస్తే ఇక్కడ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన రెండో భారతీయ సంతతి మహిళగా రికార్డులకెక్కుతారు. గత ఎన్నికల్లో జయపాల్ ఈ స్థానంలో విజయం సాధించారు. ఇక, ప్రస్తుతం ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు ప్రత్యర్ధులను సునాయాసంగా మట్టికరిపించారు.