Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

By:  Tupaki Desk   |   22 Aug 2022 11:30 AM GMT
ఇమ్రాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X
దాయాది దేశం పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. తాజాగా ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇపుడు కేసు నమోదు చేశారంటే వీలైనంత తొందరలోనే అరెస్టు చేయడం ఖాయం. పాకిస్తాన్లో నేతలను ఎప్పుడు ? ఎందుకు అరెస్టు చేస్తారో కూడా జనాలకు అర్థం కాదు. అంతా మిలిటరీ ఉన్నతాధికారుల మాయనే చెప్పాలి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలను కూడా ఏదో సెక్షన్ కింద మిలిటరీ అరెస్టు చేసేస్తుంది.

విచిత్రం ఏమిటంటే నేతలను అరెస్టు చేసినట్లు మిలిటరీ ప్రకటిస్తే కానీ ప్రధానమంత్రికి కూడా తెలీదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారంటు ఖాన్ పై ఫిర్యాదులు అందటంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

ఇస్లామాబాద్ లో జరిగిన సభలో మాజీ ప్రధాని మాట్లాడుతూ పోలీసు అధికారులు, మహిళా మెజిస్ట్రేట్, ఎన్నికల కమీషన్, రాజకీయ ప్రత్యర్ధులపై కేసులు పెట్టబోతున్నట్లు బెదిరించారట. దీనిపై అభ్యంతరాలు చెబుతు మెజిస్ట్రేట్ ఆలీ జావేద్ ఫిర్యాదు చేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే పైన చెప్పిన వారందరిపైనా కేసులు నమోదు చేస్తామని ఇమ్రాన్ బెదిరించటంలో అర్థం లేదు. ఆయనేమీ ప్రధాని సీటులో లేరు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఇంతమంది మీద కేసులు పెడతామని బెదిరించటం తప్పు. ఇప్పటికే ఖాన్ ఎక్కడ దొరుకుతారా అని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే ఖాన్ ఇంతమందిని బెదిరించటంతో మెజిస్ట్రేట్ ఫిర్యాదు చేయడం, కేసు పెట్టడం వెంటనే జరిగిపోయింది.

ఇదే సమయంలో ఖాన్ ప్రసంగాలను ఏ టీవీలో కూడా యధాతథంగా ప్రసారం చేయకూడదని ఆంక్షలు విదించింది ప్రభుత్వం. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాకు స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది.

ముందుగా ఖాన్ ప్రసంగాలను చూసి అవసరమైతే సెన్సార్ చేసి అప్పుడు మాత్రమే ప్రసారం చేయాలని చెప్పింది. అంటే ఖాన్ మాటలు జనాలకు వినిపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చూడబోతుంటే వీలైనంత తొందరలోనే మాజీ ప్రధానమంత్రిని అరెస్టుచేయటం ఖాయమనే అనుమానం పెరిగిపోతోంది.