Begin typing your search above and press return to search.

జూప‌ల్లి జంప్‌.. త్వ‌ర‌లోనే ముహూర్తం?

By:  Tupaki Desk   |   12 Oct 2022 3:40 AM GMT
జూప‌ల్లి జంప్‌.. త్వ‌ర‌లోనే ముహూర్తం?
X
మాజీ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. జూప‌ల్లి కృష్ణారావు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నా రా? ప్ర‌స్తుతం ఆయ‌న‌కు టీఆర్ ఎస్‌లో ఎలాంటి ప్రాధాన్యంద‌క్క‌డం లేదా? అందుకే ఆయ‌న ప‌క్క చూపులు చూస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడిగా ఎదిగిన జూప‌ల్లి వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. వైఎస్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుల్లో ఒక‌రిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. తెలంగాణ ఉద్య‌మం పొడ చూపుతున్న స‌మ‌యంలో వైఎస్ దానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్యానాలు చేసిన‌ప్పుడు.. ఆయ‌న‌ను ఏమీ అన‌ని, అన‌లేని నాయ‌కుల జాబితాలో నూ జూప‌ల్లి ఉండేవారు.

ముఖ్యంగా.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్హాపూర్ నియోజకవర్గంలో ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా జూప‌ల్లి వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవి అందుకున్న తర్వాత జిల్లా మొత్తం చక్రం తిప్పారు. కాంగ్రెస్ అంటే జూప‌ల్లి.. అన్న మాట‌కూడా వినిపించింది. అయితే.. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత‌.. జూపల్లి తెలంగాణా ఉద్యమంలోకి వ‌చ్చారు. అప్ప‌టికి ఉన్న‌ మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అప్ప‌ట్లో కేసీఆర్ సైతం జూప‌ల్లిని ఇంటికి పిలిచి రోజూ చ‌ర్చించిన సంద‌ర్భాలు ఉన్నాయి.

మొదటి నుంచి కేసీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్న కారణంగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా దక్కింది. అయితే, కాంగ్రెస్ నుంచి వ‌ల‌స‌లు పెర‌గ‌డం, 2018లో విజ‌యం సాధించ‌క పోవ‌డం.. ముఖ్యంగా కేటీఆర్‌తో విభేదాలు.. వంటివి జూప‌ల్లిని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు దూరం చేశాయ‌నే చ‌ర్చ న‌డిచింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. దాంతో జూపల్లికి ప్రాధాన్యత తగ్గిపోయి బీరంకు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.

కొంతకాలం తర్వాత బీరం కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. దాంతో జూపల్లిని ప‌ట్టించుకునే టీఆర్ ఎస్ నాయ‌కులు లేకుండా పోయారు. మాజీమంత్రిని నియోజకవర్గంలో అధికారులు పట్టించుకోవటం మానేశారు. చివరకు వీళ్ళిద్దరి మధ్య గొడవల కారణంగా జూపల్లి మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టి వేధించారుకూడా. దీనిపై ఆయ‌న అనేక సార్లు.. విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినా ఉపయోగం కనబడలేదని జూపల్లి భావిస్తున్నారు.

దీంతోనే పార్టీలో ఉండి ఈ స‌మ‌స్య‌లు అనుభ‌వించ‌డం క‌న్నా.. కేడ‌ర్‌ను కాపాడుకోవాల‌నే ఉద్దేశంతో కొన్నాళ్లుగా జూప‌ల్లి స్త‌బ్దుగా ఉండిపోయారు. అయితే.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయో తెలియ‌ని ఒక వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో ఆయ‌న ఇప్పుడు జంప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలుస్తోంది. సీనియర్ నేతకాబట్టి బీజేపీ, కాంగ్రెస్ నుండి ఆహ్వానాలు అందుతున్నా యి.

అయితే.. బీజేపీలో చేరితే.. ఓ వ‌ర్గం ఓటు బ్యాంకు కు దూరం కావ‌డంతోపాటు.. బీజేపీలో ఉన్న డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళతో జూపల్లికి రాజ‌కీయంగా విభేదాలు ఉన్న నేప‌థ్యంలో జూప‌ల్లి కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్‌కు సైతం.. జూప‌ల్లి వంటి నాయ‌కుల అవ‌స‌రం ఉన్నందున ఆయ‌న‌ను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.