Begin typing your search above and press return to search.

మైనింగ్‌ స్కామ్‌లో డీకే అరుణ కూతురు..!

By:  Tupaki Desk   |   18 March 2015 5:57 AM GMT
మైనింగ్‌ స్కామ్‌లో డీకే అరుణ కూతురు..!
X
ఒకవైపు వివిధ అంశాల గురించి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రయత్నిస్తున్న డీకే అరుణ ఇప్పుడు తనే ఇరకాటంలో పడిపోయారు. ఆమె కూతురు పేరు మీదున్న మైనింగ్‌ లీజులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు తేల్చారు. ఈ మేరకు హై కోర్టులో ఉన్న ఈ అంశం గురించి తాజాగా గనుల శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆసక్తికరంగా ఉంది.

డీకే అరుణ కూతురు స్నిగ్ధా పేరు మీద కుటుంబం అక్రమంగా మైనింగ్‌ చేస్తోందని దాదాపు ఏడాది కిందట టీఆర్‌ఎస్‌ వాళ్లు పిల్‌ వేయించారు. అప్పటి నుంచి ఈ అంశం గురించి విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదంపై కోర్టు అధికారుల నుంచి నివేదిక కోరింది.

ఈ నివేదికలో అక్రమాలు నిజమేనని అధికారులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా.. సరిహద్దులు దాటి డీకే ఫ్యామిలీ మైనింగ్‌ చేస్తోందని.. ఈ అక్రమాలను తాము ఎప్పుడో గుర్తించి నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు.

అయితే అప్పట్లో గనుల శాఖ డీకే అరుణ చేతిలోనే ఉండటంతో మైనింగ్‌ అనుమతులు రద్దు కాలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై డీకే అరుణ కూతురు స్నిగ్ధ, డీకే అరుణ భర్త భరత సింహారెడ్డి ల న్యాయవాదులను వివరణ కోరింది.

సమాధానం ఇవ్వడానికి తమకు కొంత గడువుకావాలని వారు కోరడంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది. మొత్తానికి ప్రతిపక్షంలో ఉండి రాజకీయ నేతగా రాణించేయాలనే ప్రయత్నంతో ఉన్న డీకే అరుణకు ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారం తలనొప్పే. మరి దీన్ని ఆమె ఎలా వదిలించుకొంటుందో!