Begin typing your search above and press return to search.

బీజేపీ మరో ప్లాన్: ఫోన్ ట్యాంపరింగ్ ఉచ్చులో మాజీ సీఎం

By:  Tupaki Desk   |   16 Aug 2019 12:56 PM GMT
బీజేపీ మరో ప్లాన్: ఫోన్ ట్యాంపరింగ్ ఉచ్చులో మాజీ సీఎం
X
కర్ణాటకలో బీజేపీ సరికొత్త ప్లానులతో దూసుకెళుతుంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి లుకలుకలని ఆసరాగా తీసుకుని కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేసి బీజేపీ అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అధికారం చేజిక్కించుకున్న వెంటనే బీజేపీ మరో సరికొత్త ఎత్తుగడ వేసింది. గత కుమారస్వామి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలతో బీజేపీ సాగించిన బేరసారాలని బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ప్రభుత్వంలోనే రెబల్ ఎమ్మెల్యేలు మద్ధతు ఉపసంహరించుకోవడంతో కుమారస్వామి సీఎం పీఠం నుంచి దిగి పోవాల్సి వచ్చింది.

కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో అనర్హత ఎమ్మెల్యేలతో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో సహ అనేక మంది నాయకుల ఫోన్ ట్యాపరింగ్ చేయించినట్లు తెలుస్తోంది. కొందరు ఐపీఎస్ అధికారులతో కలిసి కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇక దీని మీద ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కొత్త మంత్రివర్గం ఏర్పాటు కాగానే సీఎం యడియూరప్ప ఫోన్ ట్యాంపరింగ్ వివాదంపై విచారణ చేయించాలని ఫిక్స్ అయ్యారని తెలిసింది.

ప్రత్యేక టీంతో ట్యాపరింగ్ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి మాజీ సీఎం కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులకు సరైన సమాధానం చెప్పాలని యడియూరప్ప నిర్ణయించారని సమాచారం. ఇక ఈ వ్యవహారంలో కుమారస్వామితో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు వచ్చాయి. వారి మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఫోన్ ట్యాంపరింగ్ వివాదంపై బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్ గా ఉన్నారు.

ఫోన్ ట్యాపరింగ్ చెయ్యడం చట్టపరంగా పెద్ద నేరం, ఈ విషయంపై లోతుగా విచారణ జరగాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. అలాగే ఈ విషయం తనకు ఏమాత్రం తెలీదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. అయితే ఫోన్ ట్యాపరింగ్ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపించాలని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలని అన్నారు.