Begin typing your search above and press return to search.

యాగంలో వారికి మాత్రమే ఫాంహౌస్ ప్రొడక్ట్స్

By:  Tupaki Desk   |   24 Dec 2015 8:36 AM GMT
యాగంలో వారికి మాత్రమే ఫాంహౌస్ ప్రొడక్ట్స్
X
అయుత చండీయాగం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ భారీ కార్యక్రమానికి సంబంధించిన అంశాల విషయంలో ఎంతో ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ యాగంలో అత్యంత కీలకం బ్రాహ్మణులు. ఐదురాష్ట్రాల (తెలంగాణ - ఏపీ - మహారాష్ట్ర - కేరళ - కర్ణాటక) నుంచి వచ్చిన రుత్వితుల కోసం భారీగానే ఏర్పాట్లు చేశారు. వారి బస విషయంలో ఎలాంటి లోటు లేని విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఇక.. ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మడి.. ఆచారం ఎక్కువగా ఆచరించే రుత్వితుల కోసం.. వారి భోజన ఏర్పాటు కోసం అదిలాబాద్ చెన్నూరు నుంచి 40 మంది బ్రాహ్మణోత్తములను రప్పించారు. అంతేకాదు.. యాగంలో పాల్గొనే రుత్వితులకు ప్రత్యేకంగా వడ్డించటం కోసం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి 120 మంది బ్రాహ్మణులను రప్పించారు. కేవలం వీరి కోసమే 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భోజనశాలను ఏర్పాటు చేశారంటే.. ఏర్పాట్లు ఎంత భారీగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

చివరకు వీరు భోజనం చేసే ఆకుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. పోకచెక్కల ఆకులతో ప్రత్యేకంగా తయారు చేసిన విస్తర్లను కేరళ నుంచి తెప్పించారు. ఇక.. వీరి కోసం ప్రత్యేకంగా ఒక వంటశాలను ఏర్పాటు చేశారు. ఇందులోకి ఎవరిని అనుమతించరు. యాగంలో జరిపే రుత్వితులు రెండుపూటల స్నానం చేస్తారు కానీ.. భోజనం మాత్రం చేసేది ఒక్కపూటే. మిగిలిన వేళల్లో ఉపాహారం మాత్రమే తీసుకుంటారు. ఇక.. యాగం చేసే యాగశాలలో మంచినీళ్లు కూడా ముట్టరు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా.. రుచికరమైన ఆహారపదార్థాల్ని తయారు చేస్తున్నారు. ఈ మొత్తం బాధ్యతను ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు అప్పగించారు. ఆయనే దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

రుత్వితుల కోసం వండే వంటకు అవసరమైన కూరగాయల్లో దాదాపు 80 శాతం ఫాంహౌస్ నుంచే తీసుకొస్తున్నారు. వీటిల్లో క్యాప్సికం.. క్యాబేజీ.. బెండ.. దొండ.. ఆలుగడ్డ.. మెంతికూర.. పచ్చి మిర్చి.. పాలకూర తదితర కూరగాయలన్నీ ఫాంహౌస్ ప్రొడక్ట్స్ నే వినియోగిస్తున్నారు. వంకాయ.. టమోటాలను మాత్రమే బయట నుంచి తీసుకొస్తున్నారు. ఇక పూలను కూడా ఫాంహౌస్ వే వాడుతున్నారు. గులాబీ.. తామర. చామంతి లాంటి కొన్ని పువ్వులను మాత్రమే బెంగళూరును తెప్పిస్తున్నారు. మిగిలినవన్నీ ఫాంహౌస్ వే వాడుతున్నారు.