Begin typing your search above and press return to search.

పందెం కోళ్లు అరెస్ట్ .. నాలుగు రోజులుగా స్టేషన్ లోనే !

By:  Tupaki Desk   |   29 Oct 2021 11:30 PM GMT
పందెం కోళ్లు అరెస్ట్ .. నాలుగు రోజులుగా స్టేషన్ లోనే !
X
అపుడప్పుడు కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఆ అద్భుతాలు అనేవి జరుగుతాయి అంతే .. ఆ తర్వాతనే మనకి అది అద్భుతం అని తెలుస్తుంది. ఇక ఈ ప్రపంచంలో పోలీసులకి ఉన్న పవర్ ఎవరికీ ఉండదు. తప్పు చేస్తే ఎవరినైనా జైల్లో వేసే హక్కు పోలీసులకి ఉంది. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే.. వారిని పోలీసులు అరెస్టు చేయడం పోలీస్ స్టేషన్ సెల్ లో ఉంచటం జరుగుతుంది. కానీ కోళ్లను అరెస్ట్ చేయడం ఎప్పుడైనా చూశారా, కోళ్లని అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ,.. వివరాల్లోకి వెళ్తే .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులుగా పందెం కోళ్లకు ఠాణాలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఆ పందెం కోళ్లకు ఠాణాలో పనిచేసే సిబ్బంది రేషన్ బియ్యాన్ని ఆహారంగా అందిస్తూ వాటికి పహారా కాస్తున్నారు.

కోళ్లను అదుపులోకి తీసుకోవడం ఏంటి, నాలుగు రోజులుగా ఠాణాలో ఉంచుకోవడం ఏంటి, వాటికి పహారా కాయడం ఏంటి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం దంతలబోరు శివారు అటవీ ప్రాంతంలో ఈనెల 25న కోడి పందేలు నిర్వహించారు. ఈ కోడి పందేలకు సంబంధించి సమాచారం అందుకున్న పాల్వంచ రూరల్ ఎస్సై సుమన్ తన సిబ్బందితో కలిసి కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లారు. పందెం కోళ్ళ స్థావరంపై దాడి చేశారు.

ఈ సందర్భంగా మూడు పందెం కోళ్లతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం ఆ పందెం రాయుళ్ళకు పోలీసులు నోటీసులు జారీ ఇచ్చి పంపిచేశారు. కానీ పోలీసులు మాత్రం ఆ పందెం కోడిపుంజులను నేటికీ విడుదల చేయలేదు. కిన్నెరసాని రూరల్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే కోడి పుంజులను బంధించారు. పుంజుల రంగుల ఆధారంగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అంటే అప్పటి వరకు ఆ కోళ్లకు పోలీసుల సంరక్షణలో ఉండనున్నాయి.