Begin typing your search above and press return to search.

అయిదు వందల కోట్లు.... క్షణాల్లో బూడిద...

By:  Tupaki Desk   |   12 Feb 2022 4:46 PM GMT
అయిదు వందల కోట్లు.... క్షణాల్లో బూడిద...
X
వాటి విలువ అయిదువందల కోట్లు. అతి పెద్ద మొత్తం అది. కానీ ఏ మాత్రం ఆలోచించకుండా నిప్పు పెట్టేశారు. అన్నీ కలపి ఒక చోటకు తెచ్చి మరీ కాల్చేశారు. దెబ్బకు అంతా భగ్గున లేచిన మంటలో కాలి బూడిదగా మిగిలింది. విశాఖ జిల్లా సరిహద్దు ఆంధ్రా ఒడిషా ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గంజాయి ఏకంగా రష్ట్రం దేశం సరిహద్దులు దాటేసి విదేశాలకు పోతోంది.

దాని మీద ఈ మధ్యనే ఏపీలో అతి పెద్ద రాజకీయ దుమారమే లేచింది. విపక్షాలు అన్నీ కూడా విశాఖలో అక్రమ గంజాయి అంటూ హాట్ హాట్ విమర్శలు చేస్తూ వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కూడా అలెర్ట్ అయి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా కొన్ని చర్యలు తీసుకుంది. దాని ఫలితంగా గత కొన్నాళ్ళుగా గంజాయిని అక్రమంగా పట్టుకున్న దాన్ని సాగు చేసిన దాన్ని కలిపి కుప్పలుగా విశాఖ ఏజెన్సీలో పోశారు.

అవి రెండు లక్షల కిలోలుగా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం గంజాయిని విశాఖ పర్యటనలో డీజీపీ గౌతం సవాంగ్ నిప్పు పెట్టి కాల్చేశారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకుని కాల్చడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని డీజీపీ చెప్పడం విశేషం. విశాఖలో గంజాయి సాగుని తుదముట్టిస్తామని డీజీపీ చెప్పారు.

ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒక వైపు పోలీసులు, మరో వైపు ఎస్ఈబీ కలసి గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ గంజాయి మూలాలు ఉన్న ప్రాంతాలన్నింటిలో గట్టి నిఘా పెడుతున్నామని చెప్పారు. విశాఖ ఏజెన్సీలోని పదకొండు జిల్లాలతో పాటు, ఒడిషాలోని 23 చోట్ల గంజాయి పెద్ద ఎత్తున సాగు అవుతోందని ఆయన పేర్కొనడం విశేషం.

ఈ సందర్భంగా మావోయిస్టుల మీద డీజీపీ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తమ ఆదాయం కోసం మావోయిస్టులే గంజాయి సాగుని ప్రోత్సహిస్తున్నారని డీజీపీ అంటున్నారు. అయినా సరే పోలీసులు ధైర్యంగా మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్ళి గంజాయి సాగును ద్వంసం చేశారని, కేవలం మూడు నెలల వ్యవధిలోనే అయిదు వందల మంది దాకా నేరస్థులను అరెస్ట్ చేయడం తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్నారు.

ఇదిలా ఉంటే అక్రమ గంజాయిని దహనం చేసే కార్యక్రమాన్ని విశాఖ పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. దాన్ని డ్రోన్ కెమెరాల సాయంతో రికార్డు చేయడమే కాకుండా అక్కడ గిరిజనులకు తెలిసేల మైకులు పెట్టి మరీ చైతన్యం చేయడం టెంట్లు వేసి ఒక జాతరను నిర్వహించినట్లుగా జరపడం విశేషం. మొత్తానికి గంజాయి ని ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడమే కాదు, కాల్చి బూడిద చేయడంలోనే దేశంలో రికార్డు తమదని విశాఖ పోలీసులు అంటున్నారు. మరి ఇక్కడితో ఈ గంజాయి సాగు ఆగుతుందా, అక్రమ రవాణా అంతం అవుతుందా అంటే చూడాల్సిందే.