Begin typing your search above and press return to search.

విషాదం: కిక్కు కావాలని స్పిరిట్ తాగి ఐదుగురు మృతి ...!

By:  Tupaki Desk   |   1 Jun 2020 11:10 AM GMT
విషాదం: కిక్కు కావాలని స్పిరిట్ తాగి ఐదుగురు మృతి ...!
X
విశాఖ‌ జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కశింకోట గోవిందరావు కాలనీలో మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు పోగోట్టుకున్నారు. మద్యానికి బానిసగా మారడం, చీప్ లిక్కర్ రేటు కూడా భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మద్యానికి అలవాటు పడిన ఆ అయిదుమంది స్నేహితులు కిక్కు కోసం స్పిరిట్‌ను సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే , కిక్కు కోసం ఎక్కువ మోతాదులో స్పిరిట్ తీసుకోవడంతో ఐదుగురు మృతిచెందారు.

ఈ ఘటన పై పూర్తివివరాలు చూస్తే..విశాఖపట్నం జిల్లా కశీంకోట గ్రామంలోని కస్పా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూనిశెట్టి ఆనంద్, అప్పారావు, దొరబాబు, వడ్లమూరి మాణిక్యం, నూకరాజుగా గుర్తించారు. వారిలో ఆనంద్ పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో దినసరి వేతన కూలీగా పనిచేస్తున్నాడు. కశింకోటలో నివసిస్తున్నాడు. రాత్రి వారందరూ మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం మద్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. చీప్ లిక్కర్ సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. దీనితో ఆనంద్ ద్వారా ఫార్మా కంపెనీలో తయారయ్యే సర్జికల్ స్పిరిట్‌ను తెప్పించుకున్నారు. సుమారు రెండు లీటర్ల స్పిరిట్‌ను వారు కొనుగోలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ప్రమాదకరమని తెలిసినప్పటికీ..కిక్కు కోసం సర్జికల్ స్పిరిట్‌ను సేవించారు. మరుసటి రోజు వారంతా అనారోగ్యానికి గురయ్యారు. తాగినవాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురికాగా.. గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే, ఆనంద్‌ ఇంట్లో స్పిరిట్‌ క్యాన్ లభించినట్లు పోలీసులు చెప్పారు