Begin typing your search above and press return to search.

ఉద్యోగ సంఘాలకు ఫైనల్ కాల్ ?

By:  Tupaki Desk   |   1 Feb 2022 6:30 AM GMT
ఉద్యోగ సంఘాలకు ఫైనల్ కాల్ ?
X
పీఆర్సీ వివాదాన్ని పరిష్కరించే ఉద్దేశ్యంతో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం పంపింది. బహుశా ఇదే ఫైనల్ కాల్ కావచ్చు. ఎందుకంటే కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ వేయించేస్తోంది ప్రభుత్వం. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు కావాలని ఉద్యోగుల నేతలు డిమాండ్లు చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు వేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

కొత్త పీఆర్సీ ప్రకారమైతే జీతాలు తగ్గిపోతాయని ఉద్యోగుల నేతలు ఆందోళన పడుతున్నారు. మొదటి నెల జీతాలు తీసుకున్న తర్వాతే జీతాల్లోని పెరుగుదల, తగ్గుదల గురించి మాట్లాడాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ చెప్పినా ఉద్యోగుల నేతలు వినలేదు. ఈ వివాదంపై నేతలతో చర్చించేందుకు మంత్రులు కమిటి ప్రయత్నించింది. వరసగా నాలుగురోజులు చర్చించేందుకు మంత్రులు సమావేశమైనా ఉద్యోగుల నేతలు మాత్రం హాజరు కాలేదు.

మంత్రుల కమిటికి ఉద్యోగుల నేతలపై మండిపోయింది. అందుకనే ఇకపై చర్చలకు ఉద్యోగుల నేతలు వస్తేనే తాము వస్తామంటు చెప్పింది. దాని ప్రకారమే మూడు రోజులు మంత్రుల కమిటీ తరపున చర్యలకు ఎలాంటి చొరవ కనబడలేదు. అయితే మంగళవారం ఉద్యోగుల సంఘాల నేతలను చర్చలకు రమ్మంటు మంత్రుల కమిటీ నుంచి ఆహ్వానం అందింది. మొత్తం 20 మంది చర్చలకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది.

కొత్త పీఆర్సీ ప్రకారమే ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు వేయటానికి రెడీ అయిపోయింది. సోమవారం సాయంత్రానికి 2 లక్షల మంది ఉద్యోగులు జీతాల కోసం బిల్లులు పెట్టుకున్నారు. వీటిని ప్రాసెస్ చేయటానికి ఆర్ధికశాఖ రెడీ అయ్యింది. అలాగే సుమారు 5 లక్షల మంది పెన్షన్లు వేయటానికి కూడా రంగం సిద్దమైంది. బహుశా మంగళ, బుధవారాల్లో జీతాలు, పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో పడతాయి. జీతాలు, పెన్షన్లు అందుకున్న వాళ్ళంతా తమకు జీతాలు పెరిగాయో, తగ్గాయో మాట్లాడుకుంటారు. బహుశా ఈ కారణంతోనే ఉద్యోగుల నేతలను మంత్రులు చర్చలకు పిలిచుంటారు. మరిపుడు కూడా రాకపోతే ఏమి చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది.