Begin typing your search above and press return to search.

ఈ చిన్నారి కథ తెలిస్తే కన్నీళ్లొస్తాయ్

By:  Tupaki Desk   |   21 Aug 2016 5:30 PM GMT
ఈ చిన్నారి కథ తెలిస్తే కన్నీళ్లొస్తాయ్
X
తల్లి చనిపోయింది. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. తన వయసు పదేళ్లే. స్కూలుకెళ్లి చదువుకోవాలి. ఏడాది వయసున్న తన చిట్టి చెల్లెల్ని చూసుకోవాలి. ఇలాంటి సమయంలో ఏ చిన్నారి అయినా ఏం చేస్తుంది. ఆ చిన్న పాప కోసం స్కూల్ మానేస్తుంది. లేదా ఆ పాపను ఎవరైనా బంధువుల దగ్గర వదిలేస్తుంది. కానీ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సమీపంలో ఉండే శిల్ప మాత్రం అందరూ అనుకునే దానికి భిన్నంగా చేస్తోంది. కన్నీళ్లు తెప్పించే శిల్ప కథేంటో తెలుసుకుందాం పదండి.

ఫిలింనగర్‌ పద్మాలయ అంబేడ్కర్‌ నగర్‌ కు చెందిన శిల్ప తల్లి ఆరు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఆమె తండ్రి రెండో పెండ్లి చేసుకున్నాడు. శిల్పను చదువు మానేసి చెల్లెల్ని చూసుకోమన్నాడు తండ్రి. కానీ ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. అలాగని పాపను వదిలేయలేదు. పొద్దున లేచి ఇంటిపనులన్నీ చూసుకుని.. పాపను రెడీ చేసుకుని తనను స్కూలుకి తీసుకెళ్తోంది.

ఇంటి నుంచి పాఠశాలకు కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజూ నడుచుకుంటూనే పాఠశాలకు వెళ్లాలి. బరువైన పుస్తకాల సంచిని భుజంపై వేసుకొని, చెల్లెలిని ఎత్తుకొని పాఠశాలకు వెళ్తుంది శిల్ప. శిల్ప కష్టాలు చూసి స్కూల్లో ఉపాధ్యాయులు కూడా ఆమెకు సహకరిస్తున్నారు. శిల్ప క్లాసులు పూర్తయ్యే వరకు స్కూల్లోనే ఎవరో ఒకరు ఆ పాపను ఆడిస్తున్నారు. పాలు పడుతున్నారు. తిండి పెడుతున్నారు. ఇలా అందరి సహకారంతో తన చిట్టిచెల్లెల్ని చూసుకుంటూ.. తన చదువు కొనసాగిస్తున్న శిల్ప అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఐతే ఈ విషయంల శిల్ప తండ్రిని కూడా పూర్తిగా తప్పుబట్టడానికి లేదు. అతను తాపీ మేస్త్రి.. అతడి రెండో భార్య దినసరి కూలీ. వాళ్లిద్దరూ పొద్దున లేచి పనులకు వెళ్లిపోయి రాత్రికి వస్తున్నారు.