Begin typing your search above and press return to search.

తెలంగాణ దంపతుల పోరాటం.. బందీగా ఉన్న కుమార్తెను కలిసేందుకు అనుమతి

By:  Tupaki Desk   |   27 April 2022 5:31 AM GMT
తెలంగాణ దంపతుల పోరాటం.. బందీగా ఉన్న కుమార్తెను కలిసేందుకు అనుమతి
X
తెలంగాణ దంపతుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది. ఆ దంపతులు ఆశ్రమంలో ఉన్న కూతురును కలిసేందుకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన మీనావతి, రాంరెడ్డి దంపతుల కూతురు సంతోష్ రూపా అమెరికాలో నానో టెక్నాలజీలో పీహెచ్.డీ పూర్తి చేసింది. ఆధ్మాత్మికం చింతన పేరుతో ఆకర్షితురాలైన సంతోష్ రూపా ఇండియాకు తిరిగి వచ్చి నేరుగా ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమంలో చేరిపోయారు.

అప్పటినుంచి సంతోష్ రూపాను కలిసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కన్న కూతురును కలిసేందుకు కూడా ఆ ఆశ్రమ నిర్వాహకులు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. కనికరించలేదు. దీంతో తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తమ కుమార్తెను కలిసేందుకు అనుమతించాలని.. ఆశ్రమ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

వీరేందదీక్షిత్ తమ కూతురును తప్పుదోవ పట్టించి ఏడేళ్లుగా బందీగా ఉంచుకున్నాడని పిటీషన్ లో ఆ దంపతులు పేర్కొన్నారు. ఆశ్రమంపై చాలా ఏళ్ల నుంచి ఆరోపణలు ఉన్నాయని.. ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్రదీక్షిత్.. తనను తాను మహాశివుడి అవతారంగా ప్రకటించుకొని మోసాలకు పాల్పడుతున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఆ ఆశ్రమంలో 168 మంది మహిళలను బందీలుగా చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. మహిళలను ఇరుకైన గదుల్లో ఉంచి వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసి మానసికంగా.. శారీరకంగా మోసం చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే వీరేంద్ర దీక్షిత్ పై అత్యాచార కేసులతోపాటు మరో 10 కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ క్రమంలోనే 2017లో పోలీసులు ఆశ్రమంపై దాడి చేశారు. ఆ సమయంలో దొంగబాబా వీరేంద్రదీక్షిత్ పారిపోయాడు. దీంతో సీబీఐ ఈయనపై లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఆచూకీ చెబితే రూ.5 లక్షల నజారానా ప్రకటించింది. అప్పటి నుంచి వీరేంద్ర దీక్షిత్ పరారీలోనే ఉన్నాడు.

ఈ క్రమంలోనే తెలంగాణ దంపతులు మీనావతి-రాంరెడ్డి దంపతులు వేసిన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపిన్ సాంగీ ధర్మాసనం విచారణ జరిపింది. ఆశ్రమ నిర్వాహకుడు పరారీలో ఉన్నప్పుడు ఆశ్రమాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని సీబీఐని నిలదీసింది.

ఈ క్రమంలోనే ఆశ్రమ బాధ్యతలను కిరణ్ బేడీకి అప్పగించింది. ఆశ్రమంలోని మహిళల ఆరోగ్య, మానసిక, సంక్షేమ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కమిటీ వేసింది. ఇక తెలంగాణ దంపతుల కుమార్తె సంతోష్ రూపాను కలిసేందుకు అనుమతించింది.