Begin typing your search above and press return to search.

ఎస్పీల మధ్య వాగ్వాదం.. ఒక ఎస్పీ చెంప ఛెళ్లుమనిపించిన మరో ఎస్పీ

By:  Tupaki Desk   |   25 Jun 2021 11:30 AM GMT
ఎస్పీల మధ్య వాగ్వాదం.. ఒక ఎస్పీ చెంప ఛెళ్లుమనిపించిన మరో ఎస్పీ
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పోలీసు శాఖలో.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య టెంపర్ మెంట్లు పీక్స్ కు వెళ్లి.. విచక్షణ కోల్పోయారు. ఒక ఎస్పీ మరో ఎస్పీ చెంప ఛెళ్లుమనిపిస్తే.. సదరు ఎస్పీని మరో పోలీసు ఉన్నతాధికారి కాలితో తన్నిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? తదనంతరం ఏం జరిగిందన్న విషయాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్ లోని కులు ప్రాంతానికి ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలు పర్యటించే సందర్భంలో అక్కడి రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో.. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి కులు జిల్లా ఎస్పీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా..మాటా పెరగటం.. నియంత్రణ కోల్పోయిన కులు జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్.. సీఎం భద్రతా సిబ్బందిలోని ఎస్పీ స్థాయి అధికారి అయిన బ్రిజేష్ సూద్ చెంప ఛెళ్లుమనిపించారు.

దీంతో.. అక్కడే ఉన్న సీఎం భద్రతాధికారిగా వ్యవహరిస్తున్న బల్వంత్ సింగ్ ఆగ్రహంతోకులు ఎస్పీని కాలితో తన్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ గొడవను చిత్రీకరించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారుల మధ్య చోటు చేసుకున్న ఈ విపరిణామం సంచలనంగా మారింది. ఈ ఘటనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించింది. ఏమైనా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు సహనాన్ని కోల్పోవటం ఏ మాత్రం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.