Begin typing your search above and press return to search.

యూపీలో మరో దారుణం : పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో కన్నతండ్రే..!

By:  Tupaki Desk   |   7 Oct 2020 3:30 PM GMT
యూపీలో మరో దారుణం : పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో కన్నతండ్రే..!
X
ఈ సమాజంలో రోజురోజుకి పరువు హత్యలు ఎక్కువ అవుతున్నాయి. పరువు పోతుందని భావించి , ముందు వెనుక ఏ మాత్రం ఆలోచించకుండా చంపేస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హత్రాస్ ఘటన జరిగిన యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్య కలకలం రేపింది. షహజన్పూ ర్‌ జిల్లాలో బాలికను స్వయంగా ఆమె తండ్రి, సోదరుడు అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేశారు.

బాలిక తీరుతో కుటుంబం పరువు మంటగలిసిందనే ఆక్రోశంతో ఆమెను తండ్రి, సోదరుడు దారుణంగా కొట్టి చంపేశారు. సెప్టెంబర్‌ 23న బాలిక అదృశ్యం కాగా, మంగళవారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బాలికను తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపినట్టు నివేదికలు వెల్లడించాయి. ఆ తరువాత బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి నది ఒడ్డున ఖననం చేశారని పోలీసులు తెలిపారు. కాగా దళిత బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించగా సోదరుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

బాలిక గర్భం దాల్చడంతో నలుగురిలో అభాసుపాలు అవుతానని, ఆ కోపంతోనే కన్నబిడ్డను చంపుకున్నానని తండ్రి తన నేరాన్ని అంగీకరించాడు. హత్యలో పాలుపంచుకున్న బాలిక సోదరుడు పరారీలో ఉన్నాడని ఇద్దరిపై హత్యా నేరం మోపి దర్యాప్తు చేపట్టామని షహజన్పూర్‌ ఎస్ ‌ఎస్పీ ఎస్‌. ఆనంద్‌ వెల్లడించారు. బాలిక హత్యలో తల్లి, ఇతర బంధువులనూ ప్రశ్నించామని ఈ ఘటనలో వారి ప్రమేయం నిర్ధారణ కాలేదని చెప్పారు. బాలిక ఎన్నడూ స్కూలుకు వెళ్లలేదని, ఓ బంధువు వద్ద ఉండేదని కుటుంబ సభ్యలు తెలిపారని పోలీసులు చెప్పారు. మైనర్‌ బాలికతో లైంగిక సంబంధాలు నేరమని , ఆమె గర్భానికి కారణమైన వారిని కూడా ఊరికే వదిలిపెట్టమని చెప్పారు.