Begin typing your search above and press return to search.

ఈ మాజీ సీఎంను ఏం చేయాలంటారు?

By:  Tupaki Desk   |   27 Nov 2016 10:31 AM GMT
ఈ మాజీ సీఎంను ఏం చేయాలంటారు?
X
విలువైన ఆస్తి ఒకటి చేజారిందనుకుందాం. వివాదంలో ఉన్న ఆస్తిని వదిలేసుకుంటామా? లేక.. న్యాయసమ్మతంగా దాని కోసం పోరాటం చేస్తామా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పినా మొదటి దానికే ఓటు వేస్తారు. కానీ.. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా గతంలో వ్యవహరించిన ఫరూక్ అబ్దుల్లా మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం. మరే దేశంలో లేని ఒక దరిద్రమైన లక్షణం మన రాజకీయ నేతల్లో కనిపిస్తుంటంది. తనకు అత్యున్నత జీవితాన్ని ఇచ్చిన దేశానికి విధేయుడిగా ఉండాల్సింది పోయి.. పాక్ తొత్తులా మాట్లాడటం ఫరూక్ కి మాత్రమే చెల్లుతుంది. తమకు దేశభక్తి టన్నుల కొద్దీ ఉంటుందని చెప్పే నేతలు.. తమ రాజకీయ స్వార్థం కోసం.. దేశ ప్రయోజనాల్ని సైతం తాకట్టు పెట్టేందుకు సిద్ధమైపోతారు.

దాయాది పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ ఎవరు అవునన్నా.. కాదన్నా అది భారత్ దే. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆ విషయాన్ని గత ప్రభుత్వాలు ఓపెన్ గా చెప్పటానికి సైతం సాహసించలేదు. తాజాగా మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత ప్రభుత్వం ఆ విషయాన్ని చెబుతోంది. ఇలాంటి వాటితోలాభం ఏమిటన్న విషయాన్ని పక్కన పెడితే.. మనది మనదని చెప్పుకోవటం కూడా తప్పనట్లుగా మాట్లాడటం.. అలాంటి మాటల కారణంగా శాంతి దెబ్బ తింటుందని.. గొడవలు వస్తాయంటూ పిరికితనాన్ని ప్రోత్సహిస్తున్న ఫరూక్ లాంటి నేతల మాటలు ఒళ్లు మండిపోయేలా చేస్తాయి.

మొన్నటికి మొన్న కశ్మీర్ గురించి విపరీతవ్యాఖ్యలు చేసిన ఫరూక్.. తనపై వెల్లువెత్తుతున్న విమర్శల్ని తప్పు పడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత జాగీరు కాదంటూ తాను చేసిన వ్యాఖ్యల్ని మరోసారి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. భారత ఫార్లమెంట్ లో పీవోకేపై తీర్మానం ఆలోచనను తప్పు పట్టిన తీరు చూస్తే.. ఈ మాజీ ముఖ్యమంత్రిని ఏం అనాలో అర్థం కాని పరిస్థితి.

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటి నుంచో పాక్ ఆధీనంలో ఉందని.. దీనిపై యాజమాన్య హక్కుల కోసం ఇరు దేశాలు కొట్టుకుంటున్నాయని.. కానీ.. ఈ రోజుకీ ఆ ప్రాంతం పాక్ అధీనంలో ఉందని.. దీనిపై ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పీవోకేను మోడీ తీసుకోవాలనుకుంటున్నారా? అది జరిగే పనేనా? అని ప్రశ్నించిన ఫరూక్.. మోడీకి అంత దమ్ముందా? ఎవరి హద్దుల్లో వారు ఉండాల్సింది పోయి.. లేనిపోని గొడవల్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

వివాదంలో ఉన్న ఆస్తి కోసం న్యాయపోరాటం చేయాలని చెప్పాల్సింది పోయి.. వీధి రౌడీలు కనుక.. తమకు నచ్చిన వారి తరఫున పంచాయితీ చేసిన చందంగా ఒక మాజీ ముఖ్యమంత్రి శత్రుదేశానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటాన్ని ఏమనాలి? ఎలా స్పందించాలన్నది ప్రశ్న. తాను చేస్తున్న వ్యాఖ్యలపై కొందరు తనను దేశద్రోహి అని అంటున్నారని.. తనను అలా అంటున్న వారే అసలైన దేశద్రోహులని నిప్పులు చెరిగారు. ఇలా మాట్లాడే వారిని ఏం చేస్తే బాగుంటుంది..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/