Begin typing your search above and press return to search.

నేతల్ని వణికిస్తాడు ఈ కొమరయ్య

By:  Tupaki Desk   |   7 Nov 2015 11:30 AM GMT
నేతల్ని వణికిస్తాడు ఈ కొమరయ్య
X
వరంగల్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురు కావటం తెలిసిందే. శుక్రవారం ఒక సభలో ఆయన మాట్లాడుతుంటే.. ఒక వ్యక్తి చెప్పు విసరటం.. అదృష్టవశాత్తు అది వేదిక ముందున్న వారికి తగిలి పడిపోయింది. లేకుంటే.. ఈ పరిణామం అధికారపక్షానికి మరింత ఇబ్బందికరంగా మారేది. ఉప ముఖ్యమంత్రిపై చెప్పు విసిరిన వ్యక్తి గతంలో టీఆర్ ఎస్ కు వీరాభిమాని కావటం గమనార్హం. అంతేకాదు.. గతంలోనూ పలువురు అగ్రనేతల్ని తన మాటలతో.. చేష్టలతో ఇరుకున పెట్టిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.

వరంగల్ ఉప ఎన్నికల్లో తమ ప్రచారంతో దూసుకెళ్లాలన్న ఆలోచనకు షాకిచ్చిన వ్యక్తి జేసీ జేఎసీ నాయకుడు దామెరకొండ కొమురయ్య. వరంగల్ జిల్లా శాయంపేట శివారులోని అరెపల్లెకు చెందిన ఈ బీసీ నాయకుడు గతంలోనూ పలువురు అగ్రనేతలకు తన వైఖరితో కొమురయ్య షాకిచ్చాడు. సొంత భూమి లేని అతను.. కౌలుకు కొంత భూమిని తీసుకొని వ్యవసాయం చేస్తుంటాడు. తాజాగా రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. అయితే.. గిట్టుబాటు ధర లేకపోవటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మొదటి నుంచి నిలదీసే వ్యక్తిత్వం ఉన్న కొమురయ్య.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ను నిలదీశాడు. అంతేకాదు.. టీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన హరీశ్ రావును నిలదీసే ప్రయత్నం చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకి వీరాభిమాని అయిన అతడు.. తర్వాత కాలంలో ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకంగా మారారన్న మాటను చెబుతారు.

తాజాగా కడియం శ్రీహరిపై చెప్పు విసిరే ప్రయత్నం చేసిన కొమురయ్య చర్యను టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అతన్ని సైకోగా అభివర్ణిస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ గొడవ పెట్టుకోవటం అతగాడి నైజంగా అభివర్ణిస్తున్నారు. ఇక.. కడియంపై చెప్పు విసిరే ప్రయత్నం చేసిన కొమురయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 447.. 341.. 352.. 353.. 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు