Begin typing your search above and press return to search.

టీఎంసీలో చేరిన ప్రముఖ టెన్నిస్ స్టార్ ప్లేయర్ !

By:  Tupaki Desk   |   29 Oct 2021 11:30 AM GMT
టీఎంసీలో చేరిన ప్రముఖ టెన్నిస్ స్టార్  ప్లేయర్ !
X
వెటరన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్ అయ్యారు. బెంగాల్ సీఎం మమతా సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకున్నారు. అలాగే, బాలీవుడ్ నటీమణులు నసిఫా ఆలీ, మృణాలిని దేశ్‌ప్రభు‌లు కూడా టీఎంసీలో జాయిన్ అయ్యారు. వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోన్న టీఎంసీకి పేస్ చేరిక ఆత్మవిశ్వాసం నింపింది. లియాండర్ పేస్ చేరిక ను పశ్చిమ్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. టీఎంసీలో చేరిన తర్వాత లియాండర్ పేస్ మీడియాతో మాట్లాడుతూ.. టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తాను.. రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

నేను టెన్నిస్ నుంచి రిటైరయ్యాను, రాజకీయాలనే వాహనం ఎక్కి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను, దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీదీ నిజమైన ఛాంపియన్ అని పేస్ వ్యాఖ్యానించారు. క్రీడాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మమతా బెనర్జీ పనితీరును ఈ సందర్భంగా పేస్ ప్రశంసించారు. లియాండర్ పేస్ తమ పార్టీలో చేరిన విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. మమతా బెనర్జీ సమక్షంలో లియాండర్ పేస్ టీఎంసీ పార్టీలో చేరారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని పేర్కొంది. ఈ దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి 2014 నుంచి ఎదురుచూస్తున్న ప్రజాస్వామ్యం కోసం కలిసి పనిచేస్తాం అని తెలిపింది.

ఇక, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని మమతా భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వ్యూహారచన చేస్తున్నారు. మరోవైపు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా దీదీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీని ఢీకొట్టే సత్తా మమతకు మాత్రమే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, శక్తివంతమైన బీజేపీని ఎదుర్కొవడం అంత సులువుకాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా రాయ్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి కూడా బుధవారం టీఎంసీలో చేరారు. కామాక్ స్ట్రీట్‌లోని సెనేటర్ హోటల్‌లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ, ఎమ్మెల్యే వివేక్ గుప్తా సమక్షంలో కృష్ణ కళ్యాణి టీఎంసీలో చేరారు. కృష్ణ కళ్యాణి ఈ నెల ప్రారంభంలో బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.