Begin typing your search above and press return to search.

వృద్ధుడిపై దారుణం.. బతికుండగానే ఫ్రీజర్ లో పెట్టారు

By:  Tupaki Desk   |   14 Oct 2020 5:55 PM GMT
వృద్ధుడిపై దారుణం.. బతికుండగానే ఫ్రీజర్ లో పెట్టారు
X
‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు’ అని ఓ తెలంగాణ కవి గొంతెత్తి చాటాడు. ఈ ఆధునిక భారతంలో ఇప్పుడు అదే జరుగుతోంది. తన పర భేదం మరిచి తమను కన్నవారి పట్ల కసాయి కొడుకులు కాఠిన్యం చూపుతున్నారు.

తాజాగా 74 ఏళ్ల ఓ వృద్ధుడిని బతికుండగానే ఫ్రీజర్ బాక్సులో పెట్టిన దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. అతడు చనిపోకముందే ఇలా చేసి ఎదురుచూసిన వైనం కలిచివేస్తోంది. స్వయానా కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడడం అమానవీయంగా ఉంది. స్థానికంగా సంచలనం రేపింది.

తమిళనాడులోని సేలం జిల్లా కందంపట్టిలో నిన్న సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. వృద్ధుడు బాలసుబ్రహ్మణ్యం కుమార్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడు చనిపోయాడని అనుకొని ఆయన సోదరుడు శరవణ్ ఈనెల 13న మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ బాక్సు తెప్పించారు. అందులో బాలసుబ్రహ్మణ్యంను పెట్టారు.

24 గంటల తర్వాత ఆ ఫ్రీజర్ బాక్సును తీసుకెళ్లేందుకు సదురు కంపెనీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చాడు. ఆ ఫ్రీజర్ లోని వ్యక్తి శ్వాస తీసుకోవడం గమనించి షాక్ తిన్నాడు. ఇదేంటని నిలదీయడంతో స్థానికులు వచ్చారు. వారి సాయంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన తాలూకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కుటుంబ సభ్యులను దీనిపై నిలదీయగా.. ఆయన చనిపోయాడంటూ బుకాయించాడు. ‘ఆయన ఆత్మ విడిచిపెట్టలేదని.. ఆయన మరణం కోసం ఎదురుచూస్తున్నామని’ కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుటుంబంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.