Begin typing your search above and press return to search.

ఇంటిపెద్దను ఇంట్లో వాళ్లంతా కలిసి చంపేశారు

By:  Tupaki Desk   |   19 Aug 2019 6:14 AM GMT
ఇంటిపెద్దను ఇంట్లో వాళ్లంతా కలిసి చంపేశారు
X
విన్నంతనే వణుకు పుట్టేలా ఉన్న ఈ ఉదంతం హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. నిత్యం తాగి వచ్చి ఇంట్లోని వారిని వేధిస్తున్న 80 ఏళ్ల ఇంటి పెద్దను అత్యంత పాశవికంగా.. దారుణంగా చంపేసిన తీరు వింటే షాక్ తినటం ఖాయం. నిత్యం ఇంటి పెద్ద వేధింపులతో కక్ష పెంచుకున్న ఇంట్లోని వారంతా ముక్కలు ముక్కలుగా నరకటమే కాదు.. బకెట్లలో దాచేసిన వైనం తాజాగా వెలుగుచూసి సంచలనంగా మారింది. భార్య.. కుమార్తె.. కొడుకు కలిసికట్టుగా తీసుకొని ఇంటిపెద్దను కడతేర్చిన వైనం సంచలనంగా మారింది.

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో 80 ఏళ్ల సుతార్ కిషన్ మారుతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. రైల్వేలో రిటైర్డ్ లోకో పైలెట్ గా విధులు నిర్వహించేవాడు. అతనికి భార్య.. కొడుకు.. ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లైయింది. ఆమె ఈస్ట్ మారేడుపల్లిలో భర్తతో కలిసి ఉంటున్నారు. ఇదిలా ఉంటే నిత్యం తాగి వచ్చి కుటుంబ సభ్యుల్ని వేధించేవాడు. దీంతో.. అతడ్ని హతమార్చాలని ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా ఆగస్టు 16న రాత్రి తాగి వచ్చిన తండ్రిని కొడుకు చంపేశాడు. ముక్కలు ముక్కలుగా నరికి ఐదు బకెట్లలో శరీర భాగాల్ని ఉంచారు. ఇంటి పెద్దను కొడుకు చంపే సమయంలో భార్య.. కుమార్తె అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. శరీర భాగాల్ని ఉంచేందుకు బకెట్లను వారే ఇచ్చారని సమాచారం.

తండ్రిని చంపేసిన తర్వాత కొడుకు కనిపించటం లేదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో ఇంటి సమీపంలోని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించగా.. బకెట్లలో దాచి ఉంచిన శరీర భాగాలు ఉండటంతో అవాక్కు అయ్యారు. ఇంటిపెద్దను ఇంటి సభ్యులే ఇంత దారుణంగా హతమార్చటమా? అన్న షాక్ నుంచి వారు బయటకు రాలేకపోతున్నారు.

అయితే.. హత్యకు కారణం ఏమిటన్న విషయాన్ని వెంటనే చెప్పలేమని.. విచారణ జరిపిన తర్వాత చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. ఎందుకింత దారుణానికి పాల్పడి ఉంటారన్న విషయం ఇంటి సభ్యుల్ని విచారిస్తే వెలుగు చూస్తుందని చెబుతున్నారు. ఇంత దారుణ ఘటనను తమ సర్వీసులో చూడలేదని పోలీసు విభాగానికి చెందిన కొందరు వ్యాఖ్యానించటం గమనార్హం.