Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలీస్‌ అట్టర్‌ ప్లాఫ్‌

By:  Tupaki Desk   |   7 April 2015 12:30 PM GMT
తెలంగాణ పోలీస్‌ అట్టర్‌ ప్లాఫ్‌
X
నల్గొండ జిల్లా సూర్యాపేటలో మొదలైన ఉగ్రవాదుల కాల్పుల పర్వం ఇంకా కొనసాగుతోంది... తాజాగా కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌ ను వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ తెస్తున్న క్రమంలో ఆలేరు వద్ద ఎన్‌ కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్‌ కౌంటర్‌ జరగడానికి ముందువరకు తెలంగాణ పోలీసులు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించలేకపోవడం... ఉగ్రవాదులన్నది పసిగట్టలేకపోవడంతో ఏకంగా పోలీసుల ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. కేవలం పోలీసు శాఖ అజాగ్రత్త వల్లే పోలీసుల ప్రాణాలు పోయాయన్నది స్పష్టమవుతోంది. ఉగ్రవాదులని ఏమాత్రం అనుమానించకపోవడంతో పోలీసులు ఆయుధాలు... బలగాలతో వెళ్లలేదు. ఉగ్రవాదులు, నక్సల్స్‌ వాంటి వారిని ఎదుర్కోవడంలో అనుభవం ఉన్న గ్రేహౌండ్స్‌.. ఇతర ప్రత్యేక పోలీసుల సహకారం తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు.

గ్రే హౌండ్స్‌ కానిస్టేబుల్‌ లేకుంటే...

సూర్యాపేటలో తొలుత ఇద్దరు పోలీసులను కాల్చి... అర్వపల్లిలోనూ కానిస్టేబుల్‌ చంపి... ఎస్సైని, సీఐని కూడా కాల్చిన సిమి ఉగ్రవాదులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించింది కూడా సివిల్‌ పోలీసు కాదన్న కథనం వినిపిస్తోంది. వారిద్దరినీ సీఐ కాల్చారని అంటున్నా మరో కథనం కూడా వినిపిస్తోంది. నిజానికి ఈ ఎన్‌ కౌంటర్‌ లో సీఐ సాహసం, ధైర్యం, అప్రమత్తతను ఏమాత్రం విస్మరించలేం... కానీ, ఉగ్రవాదులు ఆయన్ను టార్గెట్‌ చేసి కాల్చడంతో భుజానికి గాయమైంది. అయితే... వెంటనే మరో కానిస్టేబుల్‌ మధు చురుగ్గా స్పందించి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారని కొందరు చెబుతున్నారు. లేదంటే మొత్తం అక్కడున్న పోలీసులందరూ ఆ ఇద్దరు ఉగ్రవాదుల చేతిలో చచ్చిపోయేవారే. అయితే... ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించిన కానిస్టేబుల్‌ గతంలో గ్రేహౌండ్స్‌ లో పనిచేశారు... ఆ అనుభవం వల్ల ఉగ్రవాదులను ధైర్యంగా చంపగలిగాడని చెబుతున్నారు.

పొరుగు రాష్ట్రాలు చెప్పకపోతే ఉగ్రవాదులని తెలిసేదే కాదు. దొంగలు ఎవరూ అంతకు తెగించరు. వాళ్లంత రచ్చ చేస్తున్నపుడైనా పోలీసులు అనుమానించాల్సింది.

సూర్యాపేట బస్టాండులో పోలీసులపై కాల్పులు జరిపిన తరువాత కూడా వారు ఉగ్రవాదులై ఉంటారని మన పోలీసులు అనుమానించలేదు. ఆ దిశగా విచారణ చేయలేదు. మావోయిస్టులన్న కోణంలోనూ వెళ్లలేదు... అయితే... మావోయిస్టు ప్రాబల్యమున్న ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు.... ఉగ్రవాద ప్రాబల్యమున్న కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు సూర్యాపేట ఘటనను చాలా సీరియస్‌ గా తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లు దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఆ కాల్పులకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంపైనే దృష్టి పెట్టగా.. ఆ నాలుగు రాష్ట్రాలు మాత్రం వారెవరు... పోలీసులపైనే కాల్పులు జరిపారంటే వారు కచ్చితంగా మావోయిస్టులైనా కావాలి.. లేదంటే ఉగ్రవాదులైనా కావాలన్న కోణంలో అత్యంత వేగంగా దర్యాప్తు చేశారు. తమ వద్ద గతంలో జరిగిన అలాంటి నేరాలు.. నేరగాళ్ల రికార్డుల తో పోల్చి చూసుకున్నారు. సూర్యాపేట ఘటన అర్ధరాత్రి జరగ్గా ఆ మరుసటి రోజు ఉదయం నుంచే ఆ నాలుగు రాష్ట్రాలు ముమ్మర దర్యాప్తు మొదలు పెట్టాయి. ఆ దర్యాప్తులో మధ్య ప్రదేశ్‌ పోలీసులకు ఆధారాలు దొరికాయి. దీంతో మధ్యప్రదేశ్‌ పోలీసులు హైదరాబాద్‌ చేరుకుని నేరుగా నల్గండ జిల్లా నార్కెట్‌పల్లికి వెళ్ళి అక్కడి కామనేని ఆస్పత్రిలో భద్రపరిచిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను పరిశీలించారు. వీరిద్దరు సిమి ఉగ్రవాదులని నిర్ధారించారు. తమతోపాటు తెచ్చుకున్న ఫోటోలతో మృతదేహాలను పోల్చిచూసి వీరు సిమి ఉగ్రావాదులని రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.

అందరిదీ అదే మాట..

నల్గొండ ఘటనలో ఇంటలీజెన్స్‌ వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తోందని పదవీ విరమణ చేసిన పలువురు పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని డిజీపీ అనురాగశర్మతోపాటు హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ నవీన్‌చంద్‌, డిఐజీ ఎడ్ల గంగాధర్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి మృతి చెందిన పోలీసు కుటుంబాన్ని పరా మర్శించి హైదరాబాద్‌కు వెనుదిరిగారు. కనీసం ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది, దీని వెనక ఉన్నదెవరు, ఏ దిశగా పరిశోధన జరపాలి, హంతకు లను ఎలా అరెస్టు చేయాలి అన్న అంశాన్ని పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హోంమంత్రీ అంతే..

మరోవైపు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నల్గొండకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట బస్టాండులో కాల్పులు జరిపింది దోపిడి దొంగలని హోంమంత్రి నాయిని ప్రకటిస్తే ఇందుకు డిజీపీ అనురాగ్‌శర్మ సైతం వత్తుసు పలికారని దీంతో ఉగ్రవాద ముష్కరులు రెచ్చిపోయి పోలీసులను లక్ష్యంగా చేసుకొని హతమార్చారన్న వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ ధ్యేయమని, పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తారని ఎవరికి ప్రాణహాని లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ప్రకటించారు. పోలీసు వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని అవసరమైన నిధులను అందజేసి ఈ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి బడ్జెట్‌లో పోలీస్‌శాఖ ఆధునీకరణకు ఎప్పుడూ లేని నిధులు కేటాయించినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని పోలీసులే అంటుండడం గమనారÛం.మొత్తానికి ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గరు పోలీసులు మృతిచెందగా మరో ఎస్సై చావు బతుకుల్లో ఉన్నారు... సీఐ గాయపడ్డారు. పోలీసు శాఖకు ఇంతటి నష్టం కలిగించిన ఈ ఉదంతమంతా పోలీసుల వైఫల్యం, నిఘా లోపం, ముందు చూపు లేకపోవడం వల్లే జరిగిందని... తెలంగాణ పోలీసులు అట్టర్‌ ప్లాఫయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- గరుడ