Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ ప్రేమికుడు పురుగుల మందు తాగి..?

By:  Tupaki Desk   |   15 Sept 2015 12:09 PM IST
ఫేస్ బుక్ ప్రేమికుడు పురుగుల మందు తాగి..?
X
అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సరికొత్త అవకాశాల్ని ఇస్తోంది. అయితే.. వాటిని అందిబుచ్చుకోవటంలో జరుగుతున్న తడబాట్లు విషాదాన్ని మిగిలుస్తున్నాయి. నెల్లూరులో జిల్లాలో చోటు చేసుకున్న తాజా ఘటన పలువురి మనసుల్ని చేదుగా మారుస్తోంది. సోషల్ నెట్ వర్క్ లతో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి ఆత్మహత్యాయత్నం వరకూ వెళ్లటం ఆందోళన కలిగించే అంశమే. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న తాజా ఘటన పలువురి మనసుల్ని కలిచి వేస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పవన్ ఫేస్ బుక్ ద్వారా నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అప్పుడప్పుడు పవన్ కోవూరుకు వచ్చి సదరు యువతిని కలుసుకునేవాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటం.. వారు వీరి ప్రేమకు ససేమిరా అనటం జరిగిపోయింది.

యువతి తల్లిదండ్రుల్ని ఒప్పించేందుకు తన తల్లి.. సోదరితో కలిసి వచ్చిన పవన్ కుమార్.. యువతి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు.. వారిని ఒప్పించేందుకు తెగ ప్రయత్నించాడు. అయినప్పటికీ.. వారు ససేమిరా అనటంతో పాటు.. వేరే వారితో పెళ్లి నిశ్చయం చేసేశారు. ఇదే సమయంలో ప్రేమించిన సదరు యువతి సైతం తనను మర్చిపోవాలనటంతో ఆ ప్రేమికుడు తట్టుకోలేకపోయారు.

తీవ్ర మనస్తాపానికి గురైన పవన్.. ప్రేమికురాలి ఇంటి ముందు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లు కామన్ అవుతున్న వేళ.. పెద్దలు పట్టింపులకు వెళ్లే కన్నా.. వారి ప్రేమలోని కమిట్ మెంట్ ను గుర్తించి.. అందుకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవేమో.