Begin typing your search above and press return to search.

టీడీపీ మ‌హిళా నేత హత్య స‌స్పెన్స్ వీడింది

By:  Tupaki Desk   |   21 March 2018 5:23 AM GMT
టీడీపీ మ‌హిళా నేత హత్య స‌స్పెన్స్ వీడింది
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన మ‌హిళా నేత రామిల్ల క‌విత హ‌త్య కేసు సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇంట్లో కూతురి ఎదుట అమానుషంగా ఆమెను హ‌త్య చేసిన వైనం క‌ల‌క‌లం రేపింది. వివాహ వేడుక‌కు వెళ్లి వ‌చ్చి.. కుమార్తెతో పాటు నిద్ర‌పోతున్న ఆమెపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను దారుణంగా హ‌త్య చేయ‌టం.. ఆమె న‌గ‌ల్ని దోచుకెళ్ల‌టంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. భూపాల‌ప‌ల్లి జిల్లా కాటారం మండ‌లం కొత్త‌ప‌ల్లిలో ఈ నెల 11న జ‌రిగిన ఈ హ‌త్య‌కు సంబంధించిన చిక్కుముడులు తాజాగా వీడిపోయాయి.

టీడీపీ మ‌హిళా నేత హ‌త్య వెనుక అక్ర‌మ సంబంధ‌మే కార‌ణంగా చెబుతున్నారు. సుదీర్ఘ‌కాలం భ‌ర్త‌తో విడిపోయిన క‌విత త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో ఉంటున్నారు. దూర‌పు బంధువైన ములుగు స‌ర్పంచి గుగ్గిళ్ల సాగ‌ర్ తో వివాహేత‌ర సంబంధాన్ని క‌లిగిస్తున్నారు. దీంతో.. సాగ‌ర్ స‌తీమ‌ణి సుజాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో.. వారిద్ద‌రికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి తీరులో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ నేప‌థ్యంలో భ‌ర్త సాగ‌ర్ తీరుతో మ‌న‌స్తాపానికి గురైన సుజాత ప‌లుమార్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. పోలీసుల్ని వ‌దిలేసి పెద్ద‌ల స‌మ‌క్షంలోనూ పంచాయితీ నిర్వ‌హించారు. అయినా తీరు మార‌లేదు. ఈ ఇష్యూ గురించి సుజాత‌.. పెద్దాపురానికి చెందిన ర‌జినీకాంత్‌ కు చెప్ప‌టం.. క‌విత‌ను హ‌త్య చేస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని చెప్ప‌టంతో సుజాత త‌న ఆత్మ‌హ‌త్య‌య‌త్నాన్ని వాయిదా వేసుకున్నారు.

క‌విత‌ను చంపేందుకు నేర చరిత్ర ఉన్న అశోక్‌.. చిరంజీవిలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ప‌లుమార్లు రెక్కీ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఈ నెల 11న క‌విత ఇంటి ద‌గ్గ‌ర మ‌కాం వేసిన వారు.. అర్థ‌రాత్రి వేళ కిటికీని తొల‌గించి ఇంట్లోకి ప్ర‌వేశించి.. క‌విత‌ను హ‌త్య చేశారు. అనంత‌రం పారిపోయారు. క‌విత హ‌త్య‌కు ప్లాన్ చేసిన సుజాత‌.. ర‌జ‌నీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య చేసిన వారి కోసం గాలింపు ముమ్మ‌రం చేశారు.