Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ విమానాలకు ఆంక్షలు పొడిగింపు .. ఎప్పటివరకంటే ?

By:  Tupaki Desk   |   30 Oct 2021 11:30 AM GMT
అంతర్జాతీయ విమానాలకు ఆంక్షలు పొడిగింపు .. ఎప్పటివరకంటే ?
X
కరోనా వైరస్ ప్రారంభం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కొనసాగుతున్న ఆంక్షలను డీజీసీఏ మరో నెల పొడిగించింది. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలు నవంబరు 30 వరకు యధాతథంగా ఉంటాయని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరస్పర ఒప్పందం మేరకు మాత్రమే ఆయా దేశాల నడుమ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు కొనసాగుతాయని తెలిపింది. కార్గోకు ఆంక్షలు వర్తించవని డీజీసీఏ వెల్లడించింది.

అంతకుముందు సెప్టెంబర్‌లో అక్టోబర్‌ 31 వరకు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగుతాయని డీజీసీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా, సింగపూర్‌, చైనా తదితర దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో డీజీసీఏ మరో నెలపాటు ఈ ఆంక్షలను పొడిగించింది. అయితే పరస్పర ఒప్పందం కుదుర్చుకున్న ఆయా దేశాల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతాయని, అదేవిధంగా ఎంపిక చేసిన మార్గాల్లో కూడా విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది.

అదే సమయంలో ఖతార్ ప్రభుత్వ నిబంధనలు వలస కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అక్కడి హోటల్స్‌లో క్వారంటైన్ గది లభిస్తేనే..ప్రయాణానికి అనుమతి లభిస్తుంది. లేకుంటే ఫ్లైట్ టికెట్ దొరకదు. వాస్తవానికి ఖతర్‌ కు విమాన సర్వీసులు ఎక్కువగానే ఉన్నా..ఏడు రోజుల క్వారంటైన్‌కు అవసరమైన గదులు లభించడం లేదు. దాంతో ఫ్లైట్ టికెట్ లభించక ప్రయాణాలు వాయిదా పడుతున్నాయి. ఖతార్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయులెవరైనా వారం రోజుల పాటు హోటళ్లలో సెల్ఫ్ క్వారంటైన్‌ లో ఉండాల్సిందే.

2022లో ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడోత్సవాల్ని ఖతార్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాంతో ఆ దేశంలో ఉపాధి అవకాశాలు విస్తృతమై..ఎక్కువ వీసాలు జారీ అవుతున్నాయి. మరోవైపు ఖతార్ నుంచి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లేవారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. క్వారంటైన్ గది బుక్ చేసుకున్నట్టు చూపిస్తేనే ఫ్లైట్ టికెట్ జారీ అవుతుంది. ప్రస్తుతం ఆ దేశంలో హోటల్ గదులు నిండిపోవడంతో 20 రోజులకు మించి వెయిటింగ్ నడుస్తోంది.