Begin typing your search above and press return to search.

రైతుల పాదయాత్ర లో పేలుడు.. అందులో వాస్తవం ఎంత?

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:06 AM GMT
రైతుల పాదయాత్ర లో పేలుడు.. అందులో వాస్తవం ఎంత?
X
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో అనుకోని పరిణామం చోటు చేసుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కొన్నిమీడియా సంస్థలు ప్రసారం చేసిన వార్తలకు.. మరికొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలకు మధ్య అంతరం ఎక్కువగా ఉండటం.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న పోస్టులు తేడా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

ఇంతకూ జరిగిందేమంటే.. మహా పాదయాత్రలో బెలూన్స్ కు నింపుతున్న పైప్ లీకై గ్యాస్ సిలిండర్ పేలిన ఉదంతంలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఉప్పలపాడు నుంచి మండల పరిధిలోని చిర్రికూరపాడుకు పాదయాత్రకు సాగుతున్న వేళలో.. ఈ విషాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ ఘటనలో రోజువారీ కూలీ కోసం విజయవాడ కృష్ణలంక నుంచి వచ్చిన మేడా నవీన్‌ (21), షాకలబత్తుల భాస్కర్‌రావు (16), విన్నకోట రాఘవేంద్రరావు (60)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్సులో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. వీరిలో అరవై ఏళ్ల రాఘవేంద్రరావు చికిత్స పొందుతూ మరణించారు. పాదయాత్రలో ఉన్న బెలూన్స్.. సిలిండర్ ఉన్న ఆటోను పాదయాత్ర నుంచి పోలీసులు తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే.. వాస్తవం వేరుగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వారి వాదన ప్రకారం.. సోమవారం రాత్రి వేళలో చోటు పేలుడుకు.. మహా పాదయాత్రకు సంబంధం లేదన్న మాటను బలంగా వినిపిస్తున్నారు. పాదయాత్రకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు బెలూన్లలో గ్యాస్ నింపే సిలిండర్ పేలిందని.. దానికి పాదయాత్రకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదంటున్నారు.

ఒకవేళ గ్యాస్ సిలిండర్ పాదయాత్రలో ఉన్న వేళలో పేలి ఉంటే.. నష్టం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. పాదయాత్రలో పేలుడు ఉంటే.. న్యూస్ చానళ్లు ఉత్తినే ఉండవని.. అదే హెడ్ లైన్స్ గా మారతాయన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఇలాంటి సున్నిత అంశాల మీద వార్తల్ని ఇచ్చే వేళలో.. మరింత అప్రమత్తంగా ఉండాలని.. లేనిపక్షంలో భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.