Begin typing your search above and press return to search.

నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజేతలు వీరే

By:  Tupaki Desk   |   2 April 2016 4:28 AM GMT
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజేతలు వీరే
X
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయవకాశాలు ఎలా ఉన్నాయన్న విషయంపై పలు మడియా సంస్థలు సర్వేలు జరుపుతున్నారు. అయితే.. ఇప్పటివరకూ సర్వే చేసిన సంస్థలు ఒకట్రెండు రాష్ట్రాల మీద మాత్రమే దృష్టి పెట్టిన పరిస్థితి. ఇందుకు భిన్నంగా ఇండియా టీవీ.. సీ ఓటర్ కలిసి ఐదు రాష్ట్రాలకు గాను.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఫోకస్ చేశారు. విస్తృతంగా సర్వే నిర్వహించారు.

తాజాగా ఈ సర్వే ఫలితాల్ని వెల్లడించారు. ఇప్పటివరకూ పలు సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాల్లో చెప్పిన రీతిలో కొన్ని అంశాలు కామన్ గా కనిపించినా.. మరికొన్ని అంశాలు మాత్రం కాస్త కొత్తగా ఉండడటం గమనార్హం.

రాష్ట్రాల వారీగా తాజా సర్వే చెప్పిన విశేషాలు చూస్తే.. తొలుత దక్షిణాది విషయానికి వస్తే.. తమిళనాడులో అమ్మ నేతృత్వంలోని అధికార అన్నాడీఎంకే పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవటం ఖాయమని తేలింది. ‘అమ్మ’ పేరును బ్రాండ్ గా మార్చి చేపట్టిన సంక్షేమ పథకాలు బాగానే వర్క్ వుట్ అయినట్లుగా చెబుతున్నారు. తమిళనాడులో ఇప్పటివరకూ ఒక సంప్రదాయం ఉంది. అధికారపార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలటం అక్కడ కామన్. ఈసారి ఇందుకు భిన్నంగా అమ్మ జయలలిత తన బాలాన్ని స్పష్టంగా చాటనుంది. 2011లో వచ్చిన ఓట్ల శాతంతో పోలిస్తే తగ్గినప్పటికీ.. ఫలితాలు మాత్రం అమ్మకుఅనుకూలంగా ఉంటాయని తేల్చింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకేకూటమికి 130 సీట్ల స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని తేల్చారు. ఇక.. అధికారం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకే.. కాంగ్రెస్ కూటమికి 70 సీట్లకు మించి రావని తాజా సర్వే స్పష్టం చేసింది. ఇక.. కెప్టెన్ కూటమి కానీ.. మిగిలిన వారికి 34 సీట్లు మాత్రమే వచ్చే వీలుందని తేల్చింది.

ఇక.. కేరళ విషయానికి వస్తే.. ఈ రాష్ట్రంలో మొత్తం 140 సీట్లలో కమ్యూనిస్ట్ ల నేతృత్వంలోని ఎల్ డీఎఫ్ కూటమికి అధికారం పక్కాగా చెబుతున్నారు. ప్రస్తుత అధికారపక్షాని కంటే చాలా తక్కువ ఓట్ల శాతాన్ని పొందినా.. అంతిమంగా మాత్రం స్పష్టమైన మెజార్టీని సొంతం చేసుకుంటారని తేల్చింది. ఎల్ డీఎఫ్ కు 86 సీట్లు వస్తాయని.. 2011 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే కేవలం 0.2 ఓట్ల శాతం అధిక్యతతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని తేల్చారు. ఇక.. అధికార యూడీఎఫ్ కూటమి 53 స్థానాలకే పరిమితం కానుందని తేల్చారు. ఇక.. బీజేపీ కూటమికి ఒక్క స్థానం లభించే వీలుందని లెక్క కట్టారు.

పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. దీదీ మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించటం ఖాయమంటున్నారు. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో 2011లో వచ్చిన ఓట్ల శాతం కంటే ఈసారి కాస్త పెరిగి ఘన విజయాన్ని సాధించటం ఖాయమని తేలుస్తున్నారు. 160సీట్లను దీదీ పార్టీ సొంతం చేసుకుంటుందని.. వామపక్ష కూటమి 106 స్థానాల్ని చేజిక్కించుకుంటుందని తేల్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2011లో వచ్చిన ఓట్ల శాతం (39.7) కంటే ఈసారి ఓట్ల శాతం తగ్గే (31.4) వీలుందని.. అయినా సీట్లు మాత్రం గతం కంటే (60) కాకుండా భారీ పెరుగుదల (106) ఉంటుందని తేల్చారు. కాంగ్రెస్ దారుణ పరాభవం తప్పదని.. గత ఎన్నికల్లో వచ్చిన 42 సీట్లు కాస్తా.. 21 సీట్లకు పడిపోతుందని తేల్చింది. ఇక.. బీజేపీకి ఆ రాష్ట్రంలో ఖాతా ఓపెన్ చేయలేదు. తాజా ఎన్నికల్లో నాలుగు సీట్లు లభించే వీలుందని.. ఇతరులకు మూడు సీట్లు వస్తాయని అంచనా వేసింది.

అసోం విషయానికి వస్తే ఆసక్తికర ఫలితాన్ని వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ కూటమికి విజయం పక్కా అని పలు సర్వేలు చెప్పగా.. తాజా సర్వే మాత్రం అందుకు భిన్నంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడే వీలుందన్న జోస్యాన్ని వెలువరించింది. మొత్తం 126 సీట్లు ఉన్న అసోంలో బీజేపీ కూటమి 55 సీట్లు.. కాంగ్రెస్ 53 స్థానాలు.. ఏఐయూడీఎఫ్ 12 స్థానాలు.. ఇతరులు 6 స్థానాల్ని చేజిక్కించుకుంటారని.. అసోంలో హంగ్ ఖాయమని తేల్చింది.