Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ సెకండ్ లిస్ట్... ఇక బడాబాబుల వంతు!

By:  Tupaki Desk   |   14 July 2017 11:48 AM GMT
డ్ర‌గ్స్ సెకండ్ లిస్ట్... ఇక బడాబాబుల వంతు!
X
తెలుగు నేలలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన డ్ర‌గ్స్ దందా... ఇప్ప‌టికే తెలుగు సినీ ఇండ‌స్ట్రీ టాలీవుడ్‌ ను ఓ కుదుపు కుదిపేసింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖులుగా ఉన్న ప‌లువురు డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు, మ‌రికొంద‌రు డ్ర‌గ్స్ విక్ర‌యాల్లో పాలుపంచుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్స్ వ్యాపారి కెల్విన్ సెల్ ఫోన్ లోని డేటా ఆధారంగా ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసిన పోలీసులు... ఇప్ప‌టికే టాలీవుడ్‌ కు చెందిన 8 మంది ప్ర‌ముఖుల‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19 నుంచి 27 మ‌ధ్య‌లో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని స‌ద‌రు నోటీసుల్లో వారు సినీ ప్ర‌ముఖుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నోటీసులు అందుకున్న వారిలో యంగ్ హీరో న‌వ‌దీప్‌ - కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు త‌దిత‌రులున్నారు. హీరో ర‌వితేజ‌ - ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ - హీరోయిన్ చార్మీ - ఐటెం గ‌ర్ల్ ముమైత్ ఖాన్‌ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నా... దీనిపై ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌త రాలేదు. దీనిపై మీడియాలో ప్ర‌సార‌మ‌వుతున్న వార్త‌ల‌తో టాలీవుడ్ మొత్తం అతలాకుత‌ల‌మైపోయింది. లిస్టులో ఉన్న వారి పేర్ల‌తో పాటు ఏ పాపం ఎరుగ‌ని వారి పేర్ల‌ను కూడా మీడియా ప్రస్తావిస్తోంద‌న్న వాద‌నా వినిపిస్తోంది.

ఈ త‌రహా వార్త‌ల‌తో డ్ర‌గ్స్‌ తో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని గుర్తించి అయినా... మీడియా సంయ‌మ‌నం పాటించాల‌ని అటు టాలీవుడ్‌ తో పాటు ఇటు కేసును ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే... డ్ర‌గ్స్ దందా వార్త‌ల‌తో ఇప్ప‌టిదాకా టాలీవుడ్ హ‌డ‌లిపోతే... ఇప్పుడు బ‌డాబాబుల వంతు వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే 8 మంది సినీ ప్ర‌ముఖుల‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు స్వ‌యంగా ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాలే స్వ‌యంగా వెల్ల‌డించారు. అయితే పేర్ల‌ను వెల్లడించేందుకు మాత్రం ఆయ‌న నిరాక‌రించారు. ఈ క్ర‌మంలో నేటి సాయంత్రం లోగా రెండో విడ‌త నోటీసులు వెలువ‌డ‌నున్నాయ‌న్న వార్త‌లు షికారు చేస్తున్నాయి.

రెండో జాబితాగా పేర్కొంటున్న ఈ జాబితాలో ఉన్న‌వారంతా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు - రాజ‌క‌యా నేత‌ల పుత్ర‌ర‌త్నాలు ఉన్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో ఇప్పుడు ఆయా వ‌ర్గాల్లో పెను క‌ల‌క‌ల‌మే రేగింది. స‌ద‌రు జాబితాలో త‌మ పిల్ల‌ల పేర్లు ఎక్క‌డ ఉంటాయోనన్న ఆందోళ‌న బ‌డాబాబుల్లో నెల‌కొంది. అంతేకాకుండా... త‌మ పిల్ల‌లు డ్ర‌గ్స్ వాడుతున్న విష‌యంపై స‌మాచారం ఉన్న బ‌డాబాబులు... ఇప్ప‌టిదాకా ఆ విష‌యాన్ని గుట్టుగా దాచేసి, పిల్ల‌ల‌ను స‌క్ర‌మ మార్గంలో పెట్టేందుకు య‌త్నిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో పోలీసులు జారీ చేసే నోటీసుల్లో త‌మ పిల్ల‌ల పేర్లు ఉంటే ప‌రిస్థితి ఏమిట‌న్న ఆందోళ‌న కూడా వారిని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.