Begin typing your search above and press return to search.

ఏపీ ఎక్సైజ్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది..

By:  Tupaki Desk   |   29 Oct 2019 7:40 AM GMT
ఏపీ ఎక్సైజ్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది..
X
మొన్నటివరకు దర్జాగా బతికిన బతుకు వాళ్లది. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది.. పై అధికారులు వస్తే కనీసం టీ ఇవ్వడానికి డబ్బులు లేవు. కేసులు రాసుకోవడానికి పేపర్లు - పెన్నులు లేవు. స్టేషన్ నుంచి నాటాసారా - బెల్లు షాపులపై రైడ్ చేయడానికి వాహనంలో పెట్రోల్ లేదు. ఇదీ మన ఏపీ ఎక్సైజ్ అధికారుల పరిస్థితి.

దర్జాగా బతికి ఏపీ ఎక్సైజ్ స్టేషన్ల సీఐలు - ఎస్సైలు - కానిస్టేబుళ్లు ఇప్పుడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నెలరోజులుగా దాడులే మరిచిపోయారు. సొంతంగా జీతాల్లోంచి 5శాతం ఖర్చు పెట్టుకొని రైడ్ లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఏపీలో ప్రైవేట్ మద్యం షాపులు ఉన్నప్పుడు ఎక్సైజ్ పోలీసులు - సివిల్ పోలీసుల పంట పండేది. మామూళ్లు లక్షల్లో చేతులు మారేవన్న ఆరోపణలు ఉండేవి. ఆ రెండు శాఖల ఉద్యోగుల జీవితాలు మూడు పువ్వులు - ఆరు కాయలుగా వర్ధిల్లేవి. కానీ జగన్ వచ్చాక సంపూర్ణ మధ్యపానం దిశగా అడుగులు వేశారు. దీంతో ఇప్పుడు సర్కారీ వైన్స్ వచ్చాయి. సర్కారే వైన్స్ ఇస్తుంది.. సిబ్బందిని నియమించి అమ్మిస్తుంది. దీంతో ఎక్సైజ్ - పోలీసులకు మామూళ్లు బంద్ అయిపోయాయి. దీంతో వారికి కాసుల కటకట ఆగిపోయింది.

సరే మామూళ్లు ఆగిపోయినా స్టేషన్ లో విధులు నిర్వహిద్దామని చూసినా ప్రభుత్వం నుంచి ఏడాదిగా ఎక్సైజ్ కు నిధులు ఆగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎక్సైజ్ స్టేషన్ల అద్దె - విద్యుత్ బిల్లు తదితరాలకు ఒక్కో స్టేషన్ కు ప్రభుత్వం రూ10వేలు చొప్పున ఇచ్చేది. అయితే ఏడాదిగా ఈ ఖర్చులు విడుదల కాకపోవడంతో ఎక్సైజ్ పోలీసుల పరిస్థితి ఇలా తయారైంది. ఇక ముద్దాయిలను కోర్టుకు తీసుకెళ్లడానికి కూడా డబ్బుల్లేక వారితోనే రూ.500 ఖర్చు పెట్టిస్తున్న పరిస్థితి తలెత్తుతోంది. ఇక చేసేందేం లేక సొంత డబ్బులను ఎక్సైజ్ సిబ్బంది పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ పరిస్థితిని చూసిన కొందరు సీఐలు ఎక్సైజ్ స్టేషన్ లకే ఖర్చులకు భయపడి మొహం చాటేస్తున్నారు. ఇక అందరూ ఇప్పుడు పట్టణాలకు పోస్టింగ్ లు ఇచ్చుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వ వైన్ షాపులతోపాటు బార్లు ఉండడంతో ఖర్చులను వారి నుంచి లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారట..

ఇలా ఎక్సైజ్ కష్టాలు ఏపీలో కొనసాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ, నిర్వహణ లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా జగన్ సర్కారు ఈ ఎక్సైజ్ శాఖలో ప్రక్షాళన చేసి సెట్ రైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.