Begin typing your search above and press return to search.

బీహార్‌ లో అంతేనట..హోటల్‌ లో ఈవీఎంలు - వీవీప్యాట్‌ లు !!

By:  Tupaki Desk   |   7 May 2019 7:24 AM GMT
బీహార్‌ లో అంతేనట..హోటల్‌ లో ఈవీఎంలు - వీవీప్యాట్‌ లు !!
X
బీహార్.. ఈ పేరు వింటే చాలు.. సినిమా సీన్లు గుర్తొస్తాయి. అరాచకాలకు ఆలవాలమైన రాష్ట్రం కళ్లముందు కదలాడుతుంది. రౌడీల రాజ్యం గుర్తొస్తుంది. మరీ సినిమాల్లోలా లేకపోయినా ఇప్పటికీ అక్కడి పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. ఇక, ఎన్నికలు జరిగే వేళ అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం అటకెక్కిపోతుంది. రౌడీ మూకలు రోడ్లపైకి వస్తాయి. పోలింగ్ కేంద్రాలను చుట్టుముడతాయి.

తాజా ఎన్నికల్లోనూ అక్కడ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన ఐదో విడతల ఎన్నికల్లో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ముజఫరాబాద్‌ లోని ఓ హోటల్‌ లో ఏకంగా ఆరు ఈవీఎంలు - వీవీప్యాట్‌ లు దర్శనమివ్వడం తీవ్ర విమర్శలు దారితీసింది. విషయం తెలిసిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

పోలింగ్ బూత్‌ లలో ఉండాల్సిన ఈవీఎంలు - వీవీప్యాట్‌ లు హోటల్‌ లో ఎందుకు ఉన్నాయయ్యా అంటే- దానికీ రీజనుంది. సెక్టార్ మేజిస్ట్రేట్ అవధేశ్ కుమార్ వాటిని హోటల్‌కు తీసుకెళ్లారట. ఎందుకయ్యా అంటే.. తన కారు డ్రైవర్ ఓటెయ్యడానికట! విషయం తెలిసిన అధికారులు, ఇదెక్కడి విడ్డూరమంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెక్కడి అన్యాయంటూ ఓటర్లు రోడ్లపైకి వచ్చి మేజిస్ట్రేట్‌ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన ఈసీ అవధేశ్‌ కుమార్‌ కు నోటీసులు జారీ చేసింది. ఆయనపై డిపార్ట్‌ మెంటల్ విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్ తెలిపారు.