Begin typing your search above and press return to search.

అంతా బాగుంది కానీ.. ఇక్కడ హద్దుల దాటేరేంటి తమిళసై

By:  Tupaki Desk   |   8 April 2022 12:30 PM GMT
అంతా బాగుంది కానీ.. ఇక్కడ హద్దుల దాటేరేంటి తమిళసై
X
వేలెత్తి చూపించేటోళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడుతుంటారు. అందుకు భిన్నంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా తమ గీతను దాటే ప్రయత్నం అస్సలు చేయకూడదు. మీడియా ప్రతినిధులు ఎవరైనా.. ఎప్పుడైనా.. గీత దాటే వ్యాఖ్య కోసం ప్రశ్నల్ని సంధిస్తుంటారు. అలాంటి వేళలోనే కూల్ గా ఉండి.. వారు వేసే ప్రశ్నల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా అప్పటివరకు ఉన్న సానుకూలత మిస్ అవుతుంది. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళ సై విలేకరులతో మాట్లాడే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఫుల్ మార్కులు పడేలా చేశాయనే చెప్పాలి.

సాధారణంగా చాలా రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్లు సాగుతుంటుంది. చాలా సందర్భాల్లో గవర్నర్ పెట్టే చికాకులకు ముఖ్యమంత్రులు ఇబ్బందులకు గురి కావటమే కాదు.. అయ్యో గవర్నర్ ఎంత పని చేస్తున్నారన్న వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది. అందుకు ఉదాహరణగా పశ్చిమబెంగాల్ ఎపిసోడ్ ను తీసుకోవచ్చు. ఈ మధ్యన జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతబెనర్జీ సాధించిన విజయంలో గవర్నర్ తీరు కూడా బెంగాలీలను హర్ట్ చేయటమే కాదు.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మీద ఆగ్రహానికి గురయ్యేలా చేసిందని చెప్పాలి.

తెలంగాణలో గవర్నర్ వర్సస్ ముఖ్యమంత్రి మధ్య నడుస్తున్న లొల్లి విషయానికి వస్తే.. మిగిలిన రాష్ట్రాల మాదిరి గవర్నర్ బాధ్యుడిగా.. ముఖ్యమంత్రి బాధిత స్థానంలో లేకుండా అందుకు విరుద్దమైన పరిస్థితుల్లో ఉండటం కనిపిస్తుంది. అదే తమిళ సైకు సానుకూలతగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ సెట్ కళ్లకు కట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.

అన్నింటికి మించి గవర్నర్ తల్లి మరణించి.. ఆమె భౌతికాకాయం రాజ్ భవన్ లో ఉన్నప్పుడు ఎంత శత్రువు అయినా వెళ్లి పరామర్శించటం ఉంటుంది. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ వెళ్లకపోవటాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించటం చూస్తే.. కేసీఆర్ ఎంతటి అహంకారపూరితంగా ఉంటారన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేందుకు ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పాలి.

అంతేకాదు.. గవర్నర్ ను ఇబ్బంది పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఎన్ని పనులు చేశారన్న విషయాన్ని ఏకరువు పెట్టిన ఆమె మంచి మార్కుల్నే వేసుకున్నారని చెప్పాలి. అంతా బాగుందనుకున్న వేళ.. చివర్లో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు స్పందించకుండా ఉంటే ఆమె మాటలకు మరింత విలువ ఉండేదని చెప్పాలి. కేటీఆర్ ను సీఎం చేయనున్నారా? అన్న ప్రశ్న ఏ రకంగా చూసినా తనకు సంబంధం లేని అంశం. ఒకవేళ.. దీనికి సంబంధించిన సమాచారం తెలిసినప్పటికీ.. దాన్ని దాటవేసే ప్రశ్నగా వదిలేసి ఉంటే బాగుండేది.

అందుకు భిన్నంగా ఆమె ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. అందరూ అంటున్నారని.. తనకు తెలీదని చెప్పారు. మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని తాను భావించానని.. అయితే.. అలా చేయాలంటే రాజ్ భవన్ రావాల్సి ఉంటుందని రాలేదేమో? అన్న మాటతో పాటు.. కేటీఆర్ ను సీఎం చేయాల్సి వస్తుందనే రాజ్ భవన్ తో సీఎం కేసీఆర్ వివాదం పెట్టుకున్నారేమో అంటూ సరదాగా అన్న మాటలు మాత్రం ఆమె తన గీతను దాటేశారని చెప్పక తప్పదు. ఇలాంటి వ్యాఖ్యలు గవర్నర్ తమిళ సై అప్పటివరకు వాపోయిన దానికి భిన్నంగా ఉండటంతో పాటు.. ఇలాంటివి గవర్నర్ స్పందించాల్సిన అవసరం ఉందా? అన్న భావన కలుగక మానదు. అంతా బాగున్న వేళలో.. చివర్లో ఏదో చెప్పి చెడగొట్టుకోవటం అంటే ఇదేనేమో?