Begin typing your search above and press return to search.

మారుతి నుంచి ఈవీ వెహికిల్స్ ఎప్పుడో చెప్పేసిన పెద్ద మనిషి!

By:  Tupaki Desk   |   25 Aug 2021 3:25 AM GMT
మారుతి నుంచి ఈవీ వెహికిల్స్ ఎప్పుడో చెప్పేసిన పెద్ద మనిషి!
X
దేశంలో కార్ల కంపెనీలు ఎన్ని ఉన్నా.. మారుతి సుజికి మాటే వేరు. నూటికి 70 శాతం మంది తమ మొదటికారును మారుతి సుజికితో మొదలు పెడతారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. మధ్యతరగతి జీవికి అందుబాటులో.. తక్కువ నిర్వాహణ ఖర్చుతో పాటు.. రీసేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉండే ఈ కంపెనీ వాహనాలని కొనుగోలు చేయటానికి ఆసక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో తరచూ ఎలక్ట్రికల్ వెహికిల్స్ గురించి వింటున్నా. ఇప్పటికే టాటా.. ఎంజీ లాంటి కొన్ని కంపెనీలు తమ మోడళ్లను ఈవీకి కన్వర్టు చేయటం తెలిసిందే.

అందరూ ఈవీ మోడల్ లోకి వెళుతున్నారు. మరి.. మారుతి మాటేమిటి? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం లభించినట్లేనని చెప్పాలి. మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్ సి భార్గవ.. ఈవీ వాహనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సంప్రదాయ కార్ల విభాగంలో మారుతి అగ్రస్థానంలో నిలిచిందని.. భవిష్యత్తు వాహనాల్లో నూ ఇదే తీరును సాధించాలన్నదే తమ ఉద్దేశమన్న ఆయన.. భారీ స్థాయిలో ఈవీలు వచ్చినప్పుడే వినియోగదార్లకు అందుబాటు ధరల్లోకి వస్తాయని చెప్పారు.

విద్యుత్ వాహనాల విక్రయాలు తక్కువగా ఉన్నాయని.. ఈ విభాగంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు అడుగుపెట్టినా.. అమ్మకాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఈ కారణంగా మారుతి మార్కెట్ వాటాపై ప్రభావం లేదన్నారు. కంపెనీకి నష్టాలురాకుండా కార్యకలాపాలు నిర్వహించేలా ఉన్నప్పుడే ఈవీల ఉత్పత్తి ఉంటుందన్నారు. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరి చూపు ఈవీ వెహకిల్స్ మీద పడుతోంది. కాకుంటే.. వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో.. వీటిని కొనేందుకు చాలామంది జంకుతున్నారు.

దీనికి తోడు.. వాహనాల ఛార్జింగ్ కూడా ఒక సమస్యగా మారింది. ఈ రంగంలో ఉన్న కార్లు అన్ని 300-400 కిలోమీటర్ల వరకు నడిచే వీలుంది. కానీ.. లాంగ్ ట్రిప్ లకు వెళ్లే వారికి.. ఛార్జింగ్ స్టేషన్లు పెద్దగా లేని పరిస్థితి. దీంతో వీటిని కొనుగోలు చేసే వారికి ఇదో సమస్యగా మారింది. ధర.. ఛార్జింగ్ స్టేషన్ల సవాళ్లను ఎదుర్కోగలిగితే.. ఈవీ వాహన మార్కెట్ కు తిరుగు ఉండదు. మారుతి ఛైర్మన్ మాటల్ని చూస్తుంటే.. ఇప్పట్లో ఈవీ వాహనాలు ఆ కంపెనీ నుంచి ఆశించటం అనవసరమన్న భావన కలుగక మానదు.

కరోనా తర్వాత వాహనాల డెలివరీ విషయంలో ఆలస్యం కావటం.. దీనికి చిప్ ల కొరత వెంటాడుతుందన్న మాటపైనా ఆర్ సీ భార్గవ స్పందించారు. వాహన రంగాన్ని వేధిస్తున్న చిప్ సమస్య తాత్కాలికమేనని.. 2022 నాటికి ఈ సమస్య పరిష్కారం కావొచ్చన్నారు. సో.. ఈ ఏడాదిలో కారు కొనాలన్న ప్లాన్ ఉన్న వారు కాస్త ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్న మాట.