Begin typing your search above and press return to search.

మీరలా చేస్తే మన దేశ ప్రజలకు ద్రోహం చేసినట్లే.. ఈటెల ఆగ్రహం

By:  Tupaki Desk   |   19 March 2020 5:30 AM GMT
మీరలా చేస్తే మన దేశ ప్రజలకు ద్రోహం చేసినట్లే.. ఈటెల ఆగ్రహం
X
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్య చేశారు. కూల్ గా ఉండే ఆయన తాజాగా మాత్రం అందుకు భిన్నమైన ధోరణిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొన్నటివరకూ తెలంగాణలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు లేదని.. పాజిటివ్ కేసులు మొత్తం విదేశాల నుంచి వచ్చిన వారేనని.. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకున్నట్లుగా పదే పదే చెప్పటం తెలిసిందే.

అలాంటి ఆయన బుధవారం ఒక్కసారి ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలటం తో పాటు.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ఎవరూ ఇప్పటికిప్పుడు దేశానికి రావొద్దని పేర్కొన్నారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలన్నారు.

ఆయా దేశాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండిపోవాలని.. వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల నుంచి దేశానికి వస్తే ఇక్కడి ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాశ్రాయాల్ని మూసేయాలని తాను కేంద్రమంత్రిని కోరినట్లుగా వెల్లడించారు.

ఎవరైనా అత్యవసరంగా విదేశాల నుంచి వచ్చిన వారు ఢిల్లీలో క్వారంటైన్ కావాలని ఈటెల కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని తాను కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. కొందరు విదేశాల నుంచి వచ్చిన వారు తమ సమాచారాన్ని దాచి పెడుతున్నారని.. అలా చేయటం దేశానికి ద్రోహం చేయటమే అవుతుందని ఈటెల తీవ్ర స్వరం తో వ్యాఖ్యానించటం గమనార్హం.