Begin typing your search above and press return to search.

ఈటెలకు కోపమొచ్చింది.. ఎంత తీవ్ర వార్నింగ్ ఇచ్చారంటే?

By:  Tupaki Desk   |   28 Jun 2020 7:00 AM GMT
ఈటెలకు కోపమొచ్చింది.. ఎంత తీవ్ర వార్నింగ్ ఇచ్చారంటే?
X
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ కు కోపమొచ్చింది. ఈ మధ్యనే మహమ్మారిని టెస్టు చేయటం కోసం కొన్ని ప్రైవేటు ల్యాబులకు అనుమతులివ్వటం తెలిసిందే. తమకు అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకోవటానికే తప్పించి.. సరిగా వినియోగించుకోని వారి తీరుపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో.. పరీక్షిస్తున్న శాంపిల్స్ లో 70 శాతం పాజిటివ్ కావటం ఇందుకు నిదర్శనంగా చెప్పారు.

ప్రైవేటు ల్యాబులు వెల్లడిస్తున్న ఫలితాల్ని చూస్తేనే.. అవెంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థమవుతున్నట్లు పేర్కొన్న ఈటెల..తప్పుల్ని సరిదిద్దుకోవటానికి 48 గంటలు టైమిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ల్యాబ్ లు ఐసీఎంఆర్.. ప్రభుత్వ మార్గదర్శకాల్నికచ్ఛితంగా పాటించేలా చూడాలని ఆయన కోరారు. ఒకవేళ.. తాను చేసిన హెచ్చరికను పట్టించుకోకుండా వ్యవహరిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రైవేటు ల్యాబులు ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరుపుతామని పేర్కొన్న ఈటెల.. ఇప్పటికే వెల్లడించిన పాజిటివ్ కేసుల్ని మరోసారి సరి చూస్తామని చెప్పారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం జరిపే ల్యాబ్ ల సామర్థ్యాన్ని పెంచే అంశాన్ని పరిగణలోకి తీసుకోనున్నట్లుచెప్పారు. ఇప్పుడు రోజకు నాలుగు వేల పరీక్షలు జరుపుతున్న దగ్గర దగ్గర ఏడు వేల వరకూ పరీక్షించేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ప్రైవేటు ల్యాబ్ లకు అనుమతించే ముందే.. వారి ట్రాక్ రికార్డు చూసి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. అదే సమయంలో అనుమతి ఇచ్చిన తర్వాత కూడా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ఉండేందుకు అవసరైన నిఘాను మొదటే ఏర్పాటు చేసి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి ఎదురై ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. ఈటెల లాంటి సీనియర్ సైతం ఇలాంటి వాటిని గుర్తించకపోవటం ఏమిటి?