Begin typing your search above and press return to search.

81 శాతం మందికి కరోనా వైరస్ సోకే ఛాన్స్: మంత్రి ఈటెల

By:  Tupaki Desk   |   30 July 2020 5:30 PM GMT
81 శాతం మందికి కరోనా వైరస్ సోకే ఛాన్స్: మంత్రి ఈటెల
X
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ వైరస్‌కు భయపడాల్సిన పని లేదని, ఎక్కడికి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కట్టడిలో తెలంగాణ కొంత విజయం సాధించిందన్నారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తక్కువ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశం లేదని, ఈ వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే అన్నారు. లాక్ డౌన్ సడలింపుల వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగిందని చెప్పారు. కరోనా విషయంలో కేంద్రం సాయంపై ఈటెల పెదవి విరిచారు. ఈ మహమ్మారి ప్రభావం చూస్తుంటే 81 శాతం మందికి వచ్చి పోయే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు.

కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, మొబైల్ టెస్ట్ లేబోరేటరీస్ ద్వారా పరీక్షల నిర్వహణను అందుబాటులోకి తెచ్చామని, ఇది ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. కరోనా విషయంలో విపక్షాలు రాద్దాంతం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ సహా దేశంలోని ముఖ్య నగరాల్లో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. పరీక్షల సంఖ్య పెంచడంతో కొంతమేర కట్టడి చేయవచ్చునని చెప్పారు.