Begin typing your search above and press return to search.

ఫ్యూచర్ ప్లాన్ చెప్పి షాకిచ్చిన ఈటల

By:  Tupaki Desk   |   11 Oct 2021 4:16 AM GMT
ఫ్యూచర్ ప్లాన్ చెప్పి షాకిచ్చిన ఈటల
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరాముల పల్లి.. అంబాల.. నేరెళ్ల.. గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక వరకే తన ప్రచారం ఆగదని.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా తాను ప్రచారం చేస్తూనే ఉంటానని చెప్పారు.

ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్లాన్ ను ఈటల చెప్పేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కూడా తను రాష్ట్రమంతా పర్యటిస్తానని.. అగ్గి పుట్టించి.. టీఆర్ఎస్ పార్టీని కూల్చేయటమే తన లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు తన పేరు మీద నాలుగు దొంగ ఉత్తరాల్ని పుట్టించారని.. దళిత బంధు వద్దు అని చెప్పే లేఖను క్రియేట్ చేసింది వారేనని పేర్కొన్నారు. అంతేకాదు.. తాను కేసీఆర్ కు భయపడి వాళ్ల కాళ్ల మీద పడి క్షమించమని కోరుతూ ఉత్తరం రాసినట్లుగా మరో దొంగ లేఖ పుట్టించారన్నారు.

తాను చచ్చినా ఎవరి ముందు మోకరిల్లనని స్పష్టం చేశారు. గతంలో గ్యాంగ్ స్టర్ నయిం చంపేస్తానంటేనే బెదిరిపోలేదని.. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ కాదు కదా? ఆయన జేజమ్మ వచ్చినా హుజూరాబాద్ లో గెలవలేరని.. నియోజకవర్గంలోని తన అక్కా చెల్లెళ్లు.. అన్నా తమ్ముళ్లు పద్దెనిమిదేళ్లుగా తనను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారన్నారు.

కేసీఆర్ కాదు.. ఆయన జేజమ్మ వచ్చినా హుజూరాబాద్ లో గెలవలేరన్న ఆయన.. తనను గుండెల్లో పెట్టుకున్నోళ్లు.. కేసీఆర్ సారా సీసాలకు.. డబ్బు సంచులకు లొంగిపోరని.. బెదిరింపులకు.. పోలీసు రాజ్యానికి భయపడరన్నారు. హుజరాబాద్ చైతన్యవంతమైనదన్న ఆయన.. కేసీఆర్ కుట్రలు.. కుతంత్రాల్ని ఛేదించి.. అక్టోబరు 30న హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తారన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర మంతా పర్యటిస్తానని.. టీఆర్ఎస్ పార్టీని కూల్చే వరకు తాను ఊరుకునేది లేదన్న ఈటల మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.