Begin typing your search above and press return to search.

టీఆర్‌ఎస్ ను వెంటాడుతున్న ‘ఈటల’

By:  Tupaki Desk   |   27 Nov 2021 7:20 AM GMT
టీఆర్‌ఎస్ ను వెంటాడుతున్న ‘ఈటల’
X
హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్ కు షాకిచ్చాయి. ఇక ఆ పార్టీ గడ్డురోజులు తప్పవన్న విశ్లేషణలు ఆకాశాన్నంటాయి. ఈ భావన ప్రజల్లోనూ వేళ్లూనుకుంటున్న తరుణంలో కేసీఆర్ వరుస ప్రెస్‌మీట్లతో జనం దృష్టి ఎన్నికల టాపిక్‌పై నుంచి తప్పి పోయింది. ఇక మీడియా దృష్టి కూడా ఆ తరువాత.. జరిగిన రాజధానుల రద్దు. సాగు చట్టాల ఉపంసంహరణ వంటి సంచలన విషయాల వైపునకు మళ్లింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ భవిష్యత్తుపై చర్చ కాస్తంత సద్దుమణిగింది. అయితే టీఆర్ఎస్‌ కోసం మరో హుజూరాబాద్ ఎదురుచూస్తోందన్నది జనం ప్రస్తుతం చర్చిస్తున్న టాపిక్. కరీంనగర్‌లో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌కు మళ్లీ సంకటంగా మారుతుందని సమాచారం. ఈ దిశగా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోందన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.

కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ కు పెట్టని కోటలా ఉండేది. గులాబీ పార్టీకి జిల్లాలో తిరుగులేదని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎదురుగాలి వీస్తోంది. అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలపై కాషాయపార్టీ కన్నేసింది. టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించి పోటీలో ఉన్న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కు ఈటల రాజేందర్‌ మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటల, రవీందర్‌సింగ్‌కు అనుకూలంగా మాట్లాడడంతో ఆయనకు బీజేపీ మద్దతు ఉన్నదని ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. గతంలో బీజేపీలో ఉన్న రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన తిరిగి తన మాతృసంస్థకు వెళ్తున్నారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తివాదుల మద్దతును ఈటల కూడగడుతూ ఎమ్మెల్సీ స్థానాన్ని రవీందర్‌సింగ్‌కు కట్టబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయంగా తన పట్టును ప్రదర్శించుకొని టీఆర్‌ఎస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. రవీందర్‌సింగ్‌కు అండగా కాంగ్రెస్‌, బీజేపీ ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో తనకున్న పరిచయాలతో సభ్యుల మద్దతును ఈటల కోరుతున్నట్లు సమాచారం. రవీందర్ సింగ్ కు బీజేపీ నుంచి మద్దతు ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ శిబిరంలో ఆందోళన మొదలయింది. స్థానిక ప్రజా ప్రతినిధులను ఇప్పటికే క్యాంపుకు తరలించారు. మంత్రి గంగుల కమలాకర్ ఎవరూ చేజారకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తివాదులు, కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర స్వతంత్ర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రవీందర్‌సింగ్‌ కు మద్దతు తెలుపుతున్నారని చెబుతున్నారు.

ఈటల అడుగుపెట్టడంతో కేటీఆర్ అప్రమత్తమై నట్లు తెలుస్తోంది. కేటీఆర్ రంగంలోకి దిగి కరీంనగర్‌ ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టిసారించారని చెబుతున్నారు. క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సభ్యులను క్యాంపులకు తరలించారు. జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 1,324 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 996 మంది టీఆర్‌ఎస్‌కు చెందినవారు. వీరందరిని బెంగుళూరు తరలించారని చెబుతున్నారు. మహిళా సభ్యుల వెంట వారి భర్తలు, లేక కుటుంబసభ్యులు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రవీందర్‌సింగ్‌ బరిలో ఉండడంతో గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.