Begin typing your search above and press return to search.

ఈటల గెలుపు.. కోమటిరెడ్డికి అంత ఈజీ కాదు..: ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   10 Aug 2022 6:41 AM GMT
ఈటల గెలుపు.. కోమటిరెడ్డికి అంత ఈజీ కాదు..: ఎందుకంటే..?
X
మొన్నటి వరకు 'మునుగోడు' గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలంగాణ అంతటా ఈ నియోజకవర్గం గురించే చర్చ.. ఇక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే బీజేపీలో చేరనున్నారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీలో చేరిన తరువాత రాజగోపాల్ రెడ్డి తిరి పోటీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. ఆ పార్టీలోకి వెళ్లిన వారు గెలుపు సాధ్యమని కొందరు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ తరుపున పోటీ చేసి మునగోడు ఉప ఎన్నికలో గెలుస్తానని అంటున్నాడు. అంతకుముందు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరి అలవోకగా గెలిచారు. ఇప్పుడు తాను కూడా ఈజీగా గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అయితే ఈటలకు సాధ్యమైన గెలుపు.. రాజగోపాల్ రెడ్డికి సాధ్యమవుతుందా..? ఈటలకు, రాజగోపాల్ రెడ్డికి తేడా ఏంటి..?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 2001 లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆయన మాత్రం గులాబీ నేతతోనే కొనసాగారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్నందున.. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఈటలకు మంత్రి పదవిని అప్పగించారు కేసీఆర్. మొదట ఫైనాన్ష్ మినిష్టర్ గా..ఆ తరువాత వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈటలను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి 2021లో రాజీనామా చేశారు.

అప్పటికే దుబ్బాక నియోజకవర్గాన్ని గెలుచుకున్న బీజేపీ మెల్లగా పట్టు సాధిస్తోంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలుపొందారు. ఈటల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అంతేకాకుండా దళితబంధు పథకం ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించింది. అయినా ఈటల గెలుపు సాధ్యమైంది. అయితే ఈటల గెలుపునకు ఇక్కడ అనేక కారణాలున్నాయి. కేవలం బీజేపీలో చేరడంతోనే ఈటల గెలుపు సాధ్యం కాలేదని కొందరి రాజకీయ విశ్లేషకుల భావన.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల అప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి హోదాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతీ కార్యకర్త కలిసేందుకు అవకాశం ఇచ్చారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేవారు. మంత్రిగా ఉన్న సమయంలో చాలా మందికి పోస్టులు ఇప్పించారు. కొందరిని రాజకీయాంగా అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయన అనుచరగణంతో ఆయనతో పాటే వెళ్లింది. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న టీఆర్ఎస్ ఓట్లను చీల్చినట్లయింది. ఇదిలా ఉండగా మరో పార్టీ కాంగ్రెస్ కు అక్కడ క్యాడర్ పూర్తిగా కనుమరుగైంది. ఆ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో అభ్యర్థి కరువయ్యారు. దీంతో చివరి సమయంలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాల్సి వచ్చింది. ఈ పరిమాణాలన్నీ ఈటలకు కలిసొచ్చాయి. అటు బీజేపీ క్యాడర్ కేసీఆర్ ను టార్గెట్ చేసి తమ క్యాండెట్ ను గెలిపించుకోవాలని శాయశక్తులా కృషి చేశారు. దీంతో ఈటల రాజేందర్ గెలుపు సాధ్యమైంది.

ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరబోతున్నారు. అయితే ఈటల రాజేందర్ లాగే తాను కూడా ఈజీగా గెలుస్తానని అంటున్నాడు. బీజేపీ నాయకులు సైతం రాజగోపాల్ రెడ్డికి గెలిపించి తెలంగాణలోచరిత్ర సృష్టిస్తామని అంటున్నారు. కానీ అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈటలకు, రాజగోపాల్ రెడ్డిక చాలా తేడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే..? రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి 2018లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు. 2014లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ 2018లో మరిన్ని సీట్లు గెలుచుకుంది. ఇంతటి హవాలోనూ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కేడర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కు పట్టుంది. అందుకే ఇప్పటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ పార్టీని వీడిపోలేదు. వీరు కాంగ్రెస్ ను వీడిపోతే గెలిచే అవకాశం లేదనే ఇంతకాలం పార్టీలో కొనసాగారు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరారు. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళితే అయన వెంటే వచ్చేది చాలా తక్కువ మందే అన్న చర్చ సాగుతోంది.

నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పడంతో రాజగోపాల్ రెడ్డిని అక్కడి ప్రజలు ఎన్నుకున్నారు. కానీ కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల కాలంలో కనీసం ప్రజలను కలవకుండా హైదరాబాద్ వైపే తిరుగుతున్నాడని, కేవలం అతని వ్యాపారాలను చక్కబెట్టేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లున్నాడని కొందరు వాపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా గెలిపించుకున్న రాజగోపాల్ రెడ్డి తమను ఒక్కసారైనా కలవనే లేదని ఆ పార్టీ నాయకులు ఆవేదన చెందుతున్నారు.

దీనిని బట్టి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ క్యాడర్ ఎలాగూ సెపరేట్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగానే ఇక్కడ పోటీ ఉంటుందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. దీంతో సోదరుడి గెలుపు కోసం ఆయన ఏమాత్రం సపోర్టు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఇక్కడ కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు బీజేపీ చెప్పిన కేంద్ర పథకాల గురించి ప్రజలు నమ్మారు. కానీ ఒక్క కేంద్ర ప్రభుత్వం పథకంతో తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని అర్థమైంది. ఈ తరుణంలో అసలు బీజేపీ మళ్లీ కేసీఆర్ ను తిట్టడంతోనే సరిపెట్టుకుంటుందా..? అని అనుకుంటున్నారు. అలాగే కొనసాగితే మాత్రం రాజగోపాల్ రెడ్డిని ప్రజలు ఆదరించే అవకాశం లేదని తెలుస్తోంది.