Begin typing your search above and press return to search.

రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ!... అంత వీజీ కాదుగా!

By:  Tupaki Desk   |   26 Jan 2019 11:10 AM GMT
రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ!... అంత వీజీ కాదుగా!
X
ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌... పూర్వాశ్ర‌మంలో ఐపీఎస్ అధికారిగా స‌త్తా చూపారు. ఎక్క‌డ పోస్టింగ్ ఇచ్చినా త‌న‌దైన శైలిలో క‌రుకైన పోలీసు అధికారిగా నిరూపించుకున్నారు. పోలీసు అధికారి ఉద్యోగం నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌గానే అనూహ్యంగా గ‌వ‌ర్న‌ర్ గిరీని ద‌క్కించుకున్న న‌ర‌సింహ‌న్‌... తెలుగు నేల‌లో సుదీర్ఘ కాలం పాటు ప‌ద‌విలో కొన‌సాగుతున్న వ్యక్తిగానూ రికార్డుల‌కెక్క‌బోతున్నారు. తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉండ‌గానే గ‌వ‌ర్న‌ర్‌ గా వ‌చ్చిన న‌ర‌సింహ‌న్‌... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత రెండు రాష్ట్రాల‌కూ గ‌వ‌ర్న‌ర్‌ గా కొన‌సాగుతున్నారు. సాధార‌ణంగా ఓ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా కొన‌సాగుతున్న వ్య‌క్తిని మ‌రో రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌ గా నియ‌మిస్తే... ఇన్ చార్జీ గ‌వ‌ర్న‌ర్‌ గానే ప‌రిగ‌ణిస్తారు. అయితే న‌ర‌సింహ‌న్ విష‌యంలో మాత్రం ఇన్‌ చార్జీ అన్న ప‌ద‌మే లేకుండా వ్య‌వ‌హారం సాగిపోతోంది. అంతేకాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు న‌ర‌సింహ‌న్ ప్లేస్‌ లో ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ వ‌స్తార‌నే ప్ర‌చారం సాగుతున్నా... ఎందుక‌నో ఆ దిశ‌గా కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. మొత్తంగా గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా న‌ర‌సింహ‌న్ రెండు రాష్ట్రాల‌కు ఫుల్ టైం గ‌వ‌ర్న‌ర్‌గానే త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పుతున్నారు.

అయినా ఓ రాష్ట్రానికి గ‌వ‌ర్నర్‌ గా ఉంటూ మ‌రో రాష్ట్రానికి ఇన్‌ చార్జీ గ‌వ‌ర్న‌ర్‌ గా వ్య‌వ‌హ‌రించే వారి విష‌యం చూస్తే... త‌న ఇన్ చార్జీ పాల‌న‌లోని రాష్ట్రానికి చుట్ట‌పు చూపుగా వెళ్లి రావ‌డ‌మే త‌ప్పించి అక్క‌డి వ్య‌వ‌హారాల‌ను పూర్తి స్థాయిలో ప‌ట్టించుకునే వెసులుబాటు తమ‌కు ఎక్క‌డుంటుంది? అన్న కోణంలో మిగిలిన గ‌వ‌ర్న‌ర్లంతా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్న న‌ర‌సింహ‌న్ రెండు రాష్ట్రాల్లో కూడా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తూ... రెండు తెలుగు రాష్ట్రాల పాల‌నా వ్య‌వ‌హారాల‌ను తాను చాలా చ‌క్క‌గా నిర్వహించ‌గ‌ల‌న‌న్న భ‌రోసాను కేంద్రానికి పంపుతున్నారు. ఈ కార‌ణంగానే కేంద్రం కూడా రెండు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్లు అన‌వ‌స‌ర‌మ‌ని భావిస్తున్న‌దేమో అన్న అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్నర్‌ గా కొన‌సాగ‌డం ఎంత క‌ష్ట‌మో ఇప్పుడు న‌ర‌సింహ‌న్ కు తెలిసి వ‌చ్చింద‌నే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. రిపబ్లిక్ డే సంద‌ర్భంగా తాను గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్న రాష్ట్రం నిర్వ‌హించే అధికారిక కార్య‌క్ర‌మాల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌సంగించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో న‌ర‌సింహ‌న్ ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు హాజ‌రు కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి. గ‌డ‌చిన నాలుగేళ్లుగానూ ఆయ‌న ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే ఆ నాలుగు సార్లు త‌న‌దైన శైలిలో ప్రసంగించేసి రెండు కార్య‌క్ర‌మాల‌ను జ‌య‌ప్ర‌దం చేశార‌నే చెప్పాలి.

అయితే ఈ ద‌ఫా తొలుత ఏపీ వేడుక‌ల్లో తొలుత పాల్గొని, త‌ర్వాత తెలంగాణ వేడుక‌ల‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌సంగించిన గ‌వ‌ర్న‌ర్ మాట‌లో త‌త్త‌ర‌పాటుతో పాటు ఎంత తొంద‌ర‌గా వీల‌యితే అంత తొంద‌ర‌గా ప్రసంగాన్ని ముగించాల‌న్న భావ‌న క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌సంగ పాఠాన్ని జెట్ స్పీడుతో చ‌దివేశార‌ని చెప్పాలి. ప్ర‌సంగం మొత్తం ఎక్క‌డ కూడా కాస్తంత కూడా ఆగిన‌ట్టుగా క‌నిపించ‌ని గ‌వ‌ర్న‌ర్... ప్ర‌సంగాన్ని కూడా హ‌డావిడిగానే ముగించేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఓ వైపు తెలంగాణ వేడుక‌ల్లో పాలుపంచుకోవాల్సి ఉండ‌టం, స‌మ‌యం మించిపోతుంద‌న్న కోణంలోనే గ‌వర్న‌ర్ ఈ జెట్ స్పీడును ఆశ్ర‌యించిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్నర్ అంటే అంత వీజీ కాదు క‌దా. నాలుగేళ్ల పాటు ఎలాగోలా నెట్టుకొచ్చేసిన గ‌వ‌ర్నర్‌... ఈ ద‌ఫా మాత్రం గ‌తంలో మాదిరిగా కూల్‌ గా త‌న ప్ర‌సంగాన్ని చేయ‌లేక‌పోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ గా వ్య‌వ‌హ‌రించ‌డం అంత సుల‌భం కాద‌ని న‌ర‌సింహ‌న్‌ కు ఈ ద‌ఫా తెలిసి వ‌చ్చిన‌ట్టుంది.