Begin typing your search above and press return to search.

నామినేషన్ల ప్రక్రియ సమాప్తం: కొలిక్కి వచ్చిన లెక్క

By:  Tupaki Desk   |   9 Oct 2021 1:23 AM GMT
నామినేషన్ల  ప్రక్రియ సమాప్తం: కొలిక్కి వచ్చిన లెక్క
X
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. ఇప్పటివరకు 61 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరి రోజున పెద్ద ఎత్తున పోటీదారులు కరీంనగర్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు ఇతర గుర్తింపు పొందిన పలు పార్టీల తరఫున కొందరు నామినేషన్లు వేశారు. స్వతంత్రులు ఎక్కువ మందిబరిలో నిలిచేందుకు ఉత్సాహాన్ని చూపించారు.

మొత్తం 61 నామినేషన్లలో చివరి రోజున ఏకంగ 46 మంది నామినేషన్లను దాఖలు చేయటం గమనార్హం. ఈ ఉప సమరంలో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన నిరుద్యోగులు.. ఉపాధి హామీ క్షేత్రసహాయకుల్లో కొందరు మాత్రమే శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు ఐదారుగురు వరకు ఉన్నట్లు చెబుతున్నారు. చివరి రోజునామినేషన్ల దాఖలకు సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయటం. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ఉదయం 11.55 గంటలకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా.. పొన్నం ప్రభాకర్ లతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి హరీశ్ తో వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. 12.10 గంటలకు నామినేషన్ వేసిన కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నేత.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన పాడె కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు.

అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల వేళలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. ఈ నెల 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం.. తుది పోరులో ఎంతమంది నిలుస్తారన్న దానిపై స్పష్టత రానుంది.