Begin typing your search above and press return to search.

కేంద్ర బడ్జెట్‌ లో ఈ మినహాయింపులపైనే ఉద్యోగుల ఆశలు!

By:  Tupaki Desk   |   10 Jan 2023 11:02 AM GMT
కేంద్ర బడ్జెట్‌ లో ఈ మినహాయింపులపైనే ఉద్యోగుల ఆశలు!
X
కేంద్ర బడ్జెట్‌కు తెరలేస్తోంది. మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కసరత్తులు పూర్తి చేస్తున్నారు. 2023లో ఎనిమిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2024లో లోక్‌ సభకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రజారంజకంగా బడ్జెట్‌ ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వేతన జీవులు భారీగానే నిర్మలా సీతారామన్‌ పైన ఆశలు పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా కేంద్ర బడ్జెట్‌ వేళ నిపుణులు సైతం కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని కోరుతున్నారు. కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని, గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని మినహాయింపులను కూడా 2023–24 బడ్జెట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.

కాగా కేంద్రం 2021 బడ్జెట్‌ లో ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ పన్ను విధానంలో హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ), గృహ రుణంపై వడ్డీలు, ఇతరత్రా కొన్ని పెట్టుబడులకు మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోకుండా ఉంటే పన్ను భారం తక్కువగా ఉండేలా ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏడాదికి రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను విధించరు. ఏడాదికి రూ.15 లక్షలు దాటితే మాత్రం గరిష్టంగా 30 శాతం పన్ను ఉంటుంది.

అయితే దీనివల్ల పన్ను భారం అధికంగా ఉంటోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పెట్టుబడులు, సామాజిక భద్రత సంబంధ డిడక్షన్లను ప్రత్యామ్నాయ పన్ను విధానంలోనూ అందుబాటులో ఉంచాలని నిపుణులు కోరుతున్నారు. అలాగే పన్ను రేట్లను మరింతగా క్రమబద్ధీకరించాలని సూచిస్తున్నారు.

అదేవిధంగా జీవిత బీమా ప్రీమియంలు, గృహ రుణాల రీపేమెంట్, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుల్లాంటి మినహాయింపులను అనుమతించాలని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా సింగపూర్, హాంకాంగ్‌ తదితర దేశాల తరహాలో గరిష్ట ట్యాక్స్‌ రేటును 30 శాతంగా కాకుండా 25 శాతానికి తగ్గించాలని సూచిస్తున్నారు.

అలాగే రూ. 50,000 స్టాండర్డ్‌ డిడక్షన్, రూ. 2.5 లక్షల వరకు ఇతరత్రా మినహాయింపులను అనుమతించాలని అంటున్నారు. ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతమున్న ఏడాదికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 30 శాతం ట్యాక్స్‌ రేటును రూ. 15 లక్షలు కాకుండా ఏడాదికి రూ. 20 లక్షలపైన ఆదాయానికి వర్తింపచేయాలని సూచిస్తున్నారు. రూ. 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రిబేటు ఇవ్వాలని విన్నవిస్తున్నారు.

గత రెండేళ్లు కరోనాతో ఎలాంటి మినహాయింపులు ప్రకటించని నిర్మలా సీతారామన్‌ ఈసారైనా ఉద్యోగుల ఆశలకు తగ్గట్టు పన్ను విధించే ఆదాయాన్ని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారని ఆశిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్, బెంగళూరు నగరాలను కేంద్రం మెట్రో నగరాలుగా గుర్తించడం లేదు. కేవలం ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్‌ కతాలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణిస్తోంది. వాస్తవానికి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్, బెంగళూరులోనే అద్దెలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ డిడక్షన్స్‌ కింద హైదరాబాద్, బెంగళూరును చేర్చాలని కోరుతున్నారు.

అదేవిధంగా పన్ను డిడక్షన్స్‌ కింద చూపించుకోవడానికి ఇప్పటివరకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంకు రూ.25 వేలు మాత్రమే గరిష్ట మొత్తంగా ఉంది. దీన్ని రూ.50 వేలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.