Begin typing your search above and press return to search.

విమోచన దినోత్సవం.. విలీన దినోత్సవం ... తేడా ఏంటి?

By:  Tupaki Desk   |   3 Sep 2022 12:30 PM GMT
విమోచన దినోత్సవం.. విలీన దినోత్సవం ... తేడా ఏంటి?
X
దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అయితే.. దేశం మొత్తానికి స్వాతంత్య్రం వచ్చినా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ప్రాంతంతో పాటు మహారాష్ట్రలోని కొంత ప్రాంతానికి.. కర్ణాటకలోని మరికొంత ప్రాంతానికి మాత్రం స్వాతంత్య్రం రాలేదు. దీనికి కారణం.. ఈ ప్రాంతాలన్నీ నిజాం ఏలుబడిలో ఉండటమే. ఆయన తన సంస్థానాన్ని భారతదేశంలో కలిపేందుకు ఆసక్తి చూపించలేదు. అందుకే.. యావత్ దేశం స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి ఉంటే.. హైదరాబాద్ స్టేట్ మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నిజాం రాజుకు ఇష్టం లేని కారణంగా... ఇక్కడి ప్రజలు భయంతో ఉండేవారు.

దేశంలోని రెండు ప్రాంతాలు ఒకటి కశ్మీర్ లో హిందువు రాజు ఉంటే.. అక్కడి ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉండేవారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ లో అత్యధికులు హిందువులు ప్రజలుగా ఉన్నా.. పాలకుడిగా మాత్రం ముస్లిం మతానికి చెందిన నిజాం ఉండేవారు. కశ్మీర్ రాజుకు తన ప్రాంతాన్ని మన దేశంలో కలిపేయాలని ఉంటే.. అక్కడి ప్రజల ఆలోచనలు మరోలా ఉండేవి. అందుకు భిన్నంగా దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ స్టేట్ ప్రజలంతా భారతదేశంలో కలిసిపోవాలని తపిస్తుంటే.. నిజాంకు మాత్రం అందుకు భిన్నమైన ఆలోచనలు ఉండేవి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వేళలో బ్రిటీష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనను తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే.. బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వలేదు. దేశంలో ఉన్న వందలాది సంస్థానాలకు మాత్రమే స్వాతంత్య్రం ఇచ్చింది. అంటే.. భారతదేశంగా బ్రిటిష్ వాళ్లు మనల్ని గుర్తించలేదు. ఈ కారణంతోనే తన సంస్థానానికి ఇచ్చిన స్వేచ్ఛను తనకు తగ్గట్లుగా మార్చుకోవటానికి నవాబు ప్రయత్నించాడు.

నాటి హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ.. మరాఠ్వాడా.. కర్ణాటక ప్రాంతాల్లో ఫ్యూడల్ పాలన సాగేది. ఒకవైపు దేశ్ ముఖ్.. జాగీర్దార్.. కర్ణాటక ప్రాంతాల్లోని పలువురు భూస్వాముల అధీనంలో గ్రామీణ ప్రజలు మగ్గుతుండేవారు. నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయి.. దారుణాలకు పాల్పడుతూ ఉండేవారు.గ్రామాలకు వెళ్లి ప్రజల్ని దోచుకొని.. హత్యాకాండను చేసేవారు. తనను వ్యతిరేకించిన వారిపై తన ప్రతాపాన్ని ప్రదర్శించేవాడు. ఇదెంతవరకు వెళ్లిందంటే.. రజాకార్ల దళపతి కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తామని బీరాలు పలికేవాడు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్.. కమ్యునిస్టు.. ఆర్యసమాజ్ లు తమ మార్గాల్లో పోరు షురూ చేశాయి. దీంతో.. ఈ సంస్థల్ని బ్యాన్ చేశాడు ఉస్మాన్ అలీఖాన్. దీనికి తోడు తన దగ్గర ఉన్న సంపదను పాక్ కు తరలించే ప్రయత్నాల్లో నిజాం రాజు మునిగి ఉండేవాడు. దీంతో.. హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోవాలని నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిజాం రాజు పాక్ సాయం తో పాటు.. ఐక్యరాజ్యసమితి సాయం కోసం ఆశ్రయించాడు. దీంతో 1949 సెప్టెంబరు 13న భారత సైన్యం అపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది.

భారత సైన్యం హైదరాబాద్ స్టేట్ సరిహద్దుల్లోకి రాగానే.. రాష్ట్ర ప్రజలంతా సైన్యానికి స్వాగతం పలికారు. దీంతో.. నిజాం తోక ముడవక తప్పలేదు. ఆపరేషన్ పోలో పేరుతో నిర్వహించిన ఈ పోలీస్ యాక్షన్ నేపథ్యంలో సెప్టెంబర్ 17న నిజాం రాజు తన లొంగుబాటు ప్రకటన చేశారు. దీంతో.. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైంది. దీంతో.. నిజాంను పూర్తిగా వ్యతిరేకించేవారు సెప్టెంబరు 17ను విమోచన దినంగా పేర్కొంటూ.. నిజాం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించే వారు విలీన దినోత్సవంగా పేర్కొనేవారు.

అసలు సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే.. నిజాం రాజు దుర్మార్గమైన పాలనను అడ్డుకొని.. దేశంలో భాగమయ్యే విషయంలో రాష్ట్రంలోని ముస్లింలు నిజాం పట్ల సానుకూలంగా ఉన్నారని రాజకీయ పార్టీలు భావించటమే అసలు సమస్యగా చెప్పాలి. నిజాం రాజు లొంగిపోయిన వైనాన్ని.. హైదరాబాద్ స్టేట్ ప్రజలకు స్వేచ్ఛ పొందటాన్ని విమోచనంగా పేర్కొనటంపై మైనార్టీ వర్గాలు ఆగ్రహానికి గురవుతాయన్న భావనే.. విలీనం మాటను తెర పైకి తెచ్చిందని చెప్పాలి.

నిజానికి నిజాం రాజు కానీ స్వాతంత్య్రం వచ్చినంతనే భారత దేశంలో తన సంస్థానాన్ని కలిపేందుకు అంగీకరించి ఉంటే.. అది కచ్ఛితంగా విలీనమే అయ్యేది. కానీ.. సర్దార్ పటేల్ స్వయంగా పూనుకొని ఆపరేషన్ పోలో చేపట్టిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ను విమోచనం చేస్తే.. అందుకు భిన్నంగా విలీనం అన్న మాటను వాడటం చరిత్రను వక్రీకరించినట్లే అవుతుందన్న వాదన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంపై ఫోకస్ చేసిన బీజేపీ.. ఇప్పుడు విమోచన / విలీనం ఉదంతంలో పొలిటికల్ మైలేజీ పొందాలన్న లక్ష్యంతో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.