Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు ఇప్పుడు తెలిసివ‌స్తుందా?

By:  Tupaki Desk   |   11 Aug 2015 5:43 AM GMT
తెలంగాణ‌కు ఇప్పుడు తెలిసివ‌స్తుందా?
X
గ‌త ఏడాది లాగా తెలంగాణ ప్ర‌జ‌లు విద్యుత్ క‌ష్టాల‌కు దూరంగా ఉండే ప‌రిస్థితులు లేవా? మిగులు విద్యుత్‌ ను సాధించిన తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు ఇపుడు విద్యుత్ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వా? ఈ సందేహాల‌కు అవున‌నే జవాబు వ‌స్తోంది. ప‌్ర‌స్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరిగినప్పటికీ.. తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

వర్షాలు పుష్కలంగా కురిస్తే జులై లోనే జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు నాటికి వెయ్యి మెగావాట్ల జల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. వచ్చే మార్చి వరకు 4,144 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందనుకున్నారు. ఆశించిన మేర జలవిద్యుత్‌ ఉత్పత్తి జరిగితే.. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ లలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పటికీ.. మిగులు విద్యుత్‌ ఉంటుందనే భావనతోనే ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ పై ధీమా వ్యక్తం చేసింది. అదే తరుణంలో వేసవిలో విద్యుత్‌ కోతలను అధిగమించామని.. మున్ముందు అధిగమిస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోవడం.. జల విద్యుత్‌ ఉత్పత్తి కాకపోవడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి.

వర్షాభావ పరిస్థితులతో తెలంగాణ లో మళ్లీ విద్యుత్‌ కష్టాలు మొదలయ్యాయి. రోజు అవ‌స‌రాల‌కు సరిపడా 6500 మెగావాట్ల విద్యుత్‌ అందించేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇక సాగుకు 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తే ఈ వినియోగం 11 వేల మెగావాట్లకు చేరుతుందని విద్యుత్‌ శాఖ అంచనా వేస్తోంది. మరోపక్క ప్రాజెక్టులలో నీళ్లు అడుగంటిపోతుండడంతో.. జలవిద్యుత్‌ ఉత్పత్తి ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో విద్యుత్‌ సరఫరా అగమ్యగోచరంగా మారింది.

అయితే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ.. విద్యుత్‌ ను తీసుకువచ్చేందుకు లైన్లు లేకపోవడం పెద్ద సమస్యగా తయారైంది. ఆ పనులు ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌ సాగుకు విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంది. మరోపక్క ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండడంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ 11 వేల మెగావాట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా విద్యుత్‌ తీసుకువస్తున్నప్పటికీ.. మరో 2500 మెగావాట్ల విద్యుత్‌ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఈ లోటును భర్తీ చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. విద్యుత్‌ కొనుగోలుకు ఇతర రాష్ట్రాలు అంగీకరిస్తున్నప్పటికీ.. లైన్లు లేకపోవడంతో అది సాధ్యం కావడం లేదు. ఛత్తీస్‌ గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కోసం రంగం సిద్ధమైనప్పటికీ.. నార్త్‌ నుంచి సౌత్‌ కు సరఫరా చేసే కారిడార్‌ సిద్ధంగా లేకపోవడం కూడా పెద్ద సమస్యగా తయారైంది. మరోపక్క కృష్ణపట్నం, హిందుజా నుంచి విద్యుత్‌ వస్తుందని భావించినప్పటికీ.. ఆ అవకాశాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు విపరీతమైన విద్యుత్‌ కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమస్యలన్నీ గట్టెక్కాలంటే వరుణుడు కరుణించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.