Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల గంట ఎప్పుడు మోగ‌నుందంటే?

By:  Tupaki Desk   |   3 March 2019 4:58 AM GMT
ఎన్నిక‌ల గంట ఎప్పుడు మోగ‌నుందంటే?
X
మొన్న‌టి వ‌ర‌కూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి.. దాయాది పాక్ తో నెల‌కొన్న పోరుతో ప‌క్క‌కు వెళ్లిపోయింది. అయితే.. పాక్ సైన్యానికి చిక్కిన భార‌త వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌మాన్ ను పాక్ పార్ల‌మెంటు విడుద‌ల చేయాల‌ని ఏక‌గ్రీవ తీర్మానం చేయ‌టం.. ఆ వెంట‌నే ఆయ‌న తిరిగి రావ‌టంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు స్వ‌ల్ప విరామం ఇచ్చిన‌ట్లైంది. ఓవైపు స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉగ్ర‌వాదుల‌కు.. భ‌ద్ర‌తా సిబ్బందికి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏమైనా.. మూడు రోజుల క్రితం నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు.. తాజా ప‌రిస్థితుల‌కు సంబంధం లేని ప‌రిస్థితి.

యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న‌ట్లుగా అన్ని మీడియా సంస్థ‌లు పేర్కొన‌గా.. అవ‌న్నీ తొలగిపోయిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల హ‌డావుడి షురూ అయ్యింద‌ని చెప్పాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌శ్మీర్ లో ఎన్నిక‌లు నిర్వ‌హించాలా? వ‌ద్దా? అన్న అంశంపై కేంద్ర హోంశాఖ నివేదిక కోసం ఎదురుచూస్తుంది.

ఈ నివేదిక అందిన వెంట‌నే ఈసీ ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు రెఢీగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. ఎన్నిక‌ల గంట ఎప్పుడు మోగేద‌న్న విష‌యంపై రెండు డేట్స్ పై అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తొలుత అనుకున్న ప్ర‌కారం ఈ రోజు (మార్చి 3)న ఎన్నిక‌ల గంట మోగుతుంద‌ని భావించారు. కానీ.. అది సాధ్యం కాక‌పోవ‌టం.. అమావాస్య ముందు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. 2014లో నిర్వ‌హించిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ అప్ప‌ట్లో మార్చి 2న విడుద‌ల చేశారు. ఈ లెక్క‌న ఇప్ప‌టికే ఈసారి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావాల్సి ఉంది. అయితే.. భార‌త్ - పాక్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల గంట మోగ‌లేదు.

ఇక‌.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ నెల ఆరు కానీ లేదంటే ఎనిమిది కానీ ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేస్తార‌ని చెబుతున్నారు. శివ‌రాత్రి.. ఆ వెంట‌నే వ‌చ్చే అమావాస్య తొలగిపోవ‌టంతో పాటు.. మంచిరోజుగా చెబుతున్న మార్చి ఆరున ఎన్నిక‌ల గంట మోగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఆ రోజున కాకుంటే.. ఒక రోజు తేడాతో మార్చి 8న ప‌క్కాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లవుతుంద‌ని చెబుతున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు మొత్తం తొమ్మిది విడ‌త‌లుగా జ‌రిగితే.. ఈసారి అందుకు భిన్నంగా త‌క్కువ ద‌శ‌ల్లోనే పూర్తి చేసే వీలుంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌లతో పాటు.. ఏపీ మ‌రో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి కూడా ఒకే షెడ్యూల్ విడుద‌ల చేయొచ్చ‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ కేంద్రం తీసుకునే నిర్ణ‌యాల్లో వేగం పెరిగిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఏ క్ష‌ణంలో అయినా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానున్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ కార‌ణంతోనే ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన విశాఖ రైల్వే జోన్ మీదా హ‌డావుడిగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెప్పాలి. అంతేకాదు.. ఫిబ్ర‌వ‌రి 28న జ‌రిగిన చివ‌రి మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఏకంగా 36 కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌టం కూడా ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చినందుకే ఈ హ‌డావుడి అంతా అన్న మాటను రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రాబోయే వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌తో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల హుడావుడి షురూ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.